యాదాద్రి భువనగిరి జిల్లా:గ్రహణ సమయంలో ఎలాంటి దుష్పరిణామాలు ఉండవని,గ్రహణాలు ఏర్పడడం సహజ ప్రక్రియ అని,వాటి ద్వారా ఎలాంటి చెడు ప్రభావాలు ఉండవని పారా లీగల్ వాలంటీర్ కొడారి వెంకటేష్ అన్నారు.మంగళవారం భువనగిరి జిల్లా కేంద్రంలోని బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద భువనగిరి మండల న్యాయ సేవా సమితి ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన కల్పించారు.
అనంతరం ప్రజా సంఘాల నాయకులు, ప్రజలతో కలిసి,సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడిన సమయంలో (సాయంత్రం 4 గంటలకు) అరటి పండ్లు తిని ప్రజలను చైతన్య పరిచారు.సూర్య,చంద్ర గ్రహణాలు ఏర్పడిన సమయంలో ఎలాంటి ఆహార పదార్థాలు తినకూడదని,గడ్డి,గరక పోచలను నిత్యావసర వస్తువులపై వేయాలని,గర్భిణీ స్త్రీలు ఎలాంటి పానీయాలు,ఆహారం తీసుకోరాదని చెప్పడంలో ఎలాంటి శాస్త్రీయత లేదన్నారు.
సూర్యునికి చంద్రునికి మద్య భూమి రావడంతో,భూమి నీడ చంద్రుని మీద పడి చంద్రుడు పాక్షికంగా కానీ,పూర్ణంగా కానీ కనిపించకపోవడంతో చంద్రగ్రహణం ఏర్పడుతుందని ఆయన అన్నారు.గ్రహణం పూర్తి అయిన తర్వాత స్నానం చేయాలని ,ఇల్లు శుభ్రం చేసుకోవాలని చెప్పడం మూర్ఖత్వం అని ఆయన అన్నారు.







