ఏపీ అధికార పార్టీ వైసీపీలో ముసలం మొదలైనట్టుగానే కనిపిస్తోంది .చాలా కాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై సీనియర్ నేతలు సైతం తీవ్ర అసంతృప్తితోనే ఉన్నారు.
ఇక ఎమ్మెల్యేల్లోనూ చాలా అసంతృప్తి కనిపిస్తోంది. పార్టీలోను , ప్రభుత్వంలోనూ చోటుచేసుకుంటున్న వ్యవహారాలు కారణంగా ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నామని , ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపతున్నామని , చిన్నచిన్న పనులు కూడా చేసి పెట్టలేక కేడర్ ముందు అభాసుపాలు అవుతున్నామని ఆవేదన చెందుతూ వస్తున్నారు.
కొంతమంది బహిరంగంగానే మీడియా ముందు తమ ఆవేదనను వెళ్లగక్కుతూ ఉండగా, కొంతమంది పార్టీ కీలక నేతల దగ్గర తమ బాధను వెళ్ళబోసుకుంటున్నారు.ఇప్పటికే నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అలాగే ఆనం రామనారాయణ రెడ్డి వంటి వారు మీడియా ముందు తమ బాధను వెళ్ళగక్కారు.

తాజాగా మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సంచలనం కామెంట్స్ తో తెరపైకి వచ్చారు.పదిమంది రౌడీలను వెంటేసుకుని తిరగడం చేతకాక, తాను పాత తరం నాయకుడు గానే మిగిలిపోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.తాను పుట్టినప్పటినుంచి తన తండ్రి రాజకీయాల్లోనే ఉన్నారని, 50 ఏళ్లుగా తమ కుటుంబం రాజకీయం చేస్తుందని అప్పటితో పోలిస్తే ప్రస్తుత రాజకీయాలు బాగా మార్పు చెందాయని కృష్ణ ప్రసాద్ అన్నారు.

రౌడీలను వెంటేసుకుని వారిలా ప్రవర్తిస్తేనే ముందడుగు వేసేలా ప్రస్తుత రాజకీయాలు ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఒక్కోసారి రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేను ఎందుకయ్యానా అని బాధపడుతున్నానని, సగటు వ్యక్తులకు కొన్నిసార్లు సాయం చేయలేకపోతున్నానని కృష్ణ ప్రసాద్ వాపోయారు.గత మూడున్నర ఏళ్లలో తాను ఎక్కడా అక్రమ కేసులు ఎవరి పైనా పెట్టించలేదని, ఎవరికీ పధకాలు ఆపలేదని, కేసుల విషయంలో కొంతమంది నాయకులకు తనపై అసంతృప్తి ఉండవచ్చని అన్నారు.
ఇటీవల పార్టీలో జరుగుతున్న పరిణామాలతో కలత చెందే నియోజకవర్గంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సైతం నిలిపివేశానంటూ వసంత కృష్ణ ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు.మొత్తంగా వైసీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, సీనియర్ అయిన తనకు తగిన ప్రాధాన్యం దక్కకపోవడంపై వసంత కృష్ణ ప్రసాద్ ఈ విధంగా తన ఆవేదనను వెళ్లగక్కినట్లు కనిపిస్తున్నారు.
ఈయన విషయంలో ఇప్పుడు వైసీపీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో…?







