ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టిడిపి నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు వైసిపి కి అనుబంధంగా కొనసాగుతున్నారు.ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ , అనధికారికంగా వైసిపి ఎమ్మెల్యేలు గానే చలమణి అవుతున్నారు.
ఏపీలో వైసీపీ అధికారంలో ఉండటంతో, తమకు అన్ని విధాలుగా లబ్ధి చేకూరుతుందనే అంచనాతో చాలా మంది ఎమ్మెల్యేలు వైసిపి కి అనుబంధంగా కొనసాగుతున్నారు.అయితే అలా చేరిన వారిలో ఎంతమంది పరిస్థితి మెరుగ్గా ఉంది ? మరి ఎంత మంది రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే విషయంపై ఆరా తీస్తే దాదాపుగా అలా చేరిన ఎమ్మెల్యేలంతా రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు, రాబోయే రోజుల్లో తమ రాజకీయ భవిష్యత్తును గందరగోళంలో కి నెట్టేసుకున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.అనధికారికంగా వైసీపీలో చేరినా, అక్కడ వైసిపి క్యాడర్ టిడిపి నుంచి వచ్చిన ఎమ్మెల్యే లకు తగిన సహకారం అందించకపోవడం, నియోజకవర్గాల్లో మొదటి నుంచి ఉన్న వైసీపీ నాయకులతో వీరికి విభేదాలు ఏర్పడడం, గ్రూపు రాజకీయాలు పెరిగిపోవడం, రాబోయే ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎమ్మెల్యే టికెట్ దక్కుతుంది అనే భరోసా లేకపోవడం, ఇలా ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
విశాఖ దక్షిణ టిడిపి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ వ్యవహారాన్ని చూసుకుంటే ఆయన నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు తాజాగా ప్రకటించారు.
వైసీపీ ఇన్ చార్జ్ వై వి సుబ్బారెడ్డి కి రాజీనామా లేఖను పంపించారు.ఆయన వైసీపీ కి అనుబంధంగా కొనసాగుతున్నప్పటికీ పార్టీ కేడర్ తో పాటు, వైసీపీ అధిష్టానం పెద్దలు తనకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదనే అసంతృప్తి గణేష్ లో పేరుకుపోయింది.
దీంతో ఇప్పుడు ఆయన వైసీపీ కి దూరం అవ్వాలని దాదాపుగా డిసైడ్ అయిపోయారు.ఇప్పుడు ఆయన టిడిపిలో యాక్టివ్ అవుదామని ప్రయత్నించినా, అక్కడ ఆ చాన్స్ ఆయనకు దక్కే అవకాశం లేదు.
అలాగే రాబోయే ఎన్నికల్లో టిడిపి తరఫున కానీ, వైసీపీ తరఫున కానీ ఆయనకు టికెట్ దక్కే అవకాశం లేదనే విషయం స్పష్టమవుతోంది.ఇక గన్నవరం టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారాన్ని చూసుకుంటే, ఆయన వైసీపీకి అనుబంధం కొనసాగుతున్నారు.
అప్పటి నుంచి అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు .

వైసిపి క్యాడర్ ఆయనకు సహకారం అందించకపోవడం, అలాగే సీనియర్ నాయకుడు దుట్టా రామచంద్ర రావు తో మొదటి నుంచి ఉన్న విభేదాలు, 2019లో తన పై పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు తోను ఉన్న విభేదాలు వంశీకి ఇబ్బందికరంగా మారాయి.వైసిపి క్యాడర్ పూర్తిగా వంశీ క సహకరించే పరిస్థితి లేకపోవడంతో రాబోయే ఎన్నికల్లో టికెట్ దక్కే ఛాన్స్ అంతంత మాత్రమే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఇక గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే మద్దాల గిరి వ్యవహారం ఇదే విధంగా ఉంది.
ఆయన టిడిపి నుంచి గెలిచిన తర్వాత వైసీపీ కి అనుబంధంగా కొనసాగుతున్నారు.ఆయనకు ఉన్న పత్తి మిల్లులో వ్యవహారం కారణంగానే ఆయన వైసీపీకి దగ్గరయినట్టు ప్రచారం జరుగుతోంది.
ఆయన కూడా వైసీపీ కేడర్ తో ఇదే రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అధికార పార్టీ కి అనుబంధంగా కొనసాగుతున్నా, రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కోవడం వంటివి వీరికి అసంతృప్తిని కలిగిస్తున్నాయి.
ఇక టిడిపి సీనియర్ నాయకుడిగా ఉన్న కరణం బలరాం రాజకీయ భవిష్యత్తు ఇదే విధమైన గందరగోళంలో పడింది.