ఏపీలో గత సాధారణ ఎన్నికల్లో వైసీపీ ఏకంగా 151 సీట్లు సాధించి బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది.అయితే ప్రకాశం జిల్లాలో మాత్రం టీడీపీ సత్తా చాటుకుని పరువు నిలుపుకుంది.
ఈ జిల్లాలో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు గెలిస్తే వారిలో ఒకరు అధికార పార్టీ గొడుకు కిందకు వెళ్లిపోయారు.చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం పార్టీ మారిపోగా మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీలోనే కొనసాగుతున్నారు.
ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ఆర్థికంగా ఎంతో నష్టపోయినా.అధికార పార్టీ నుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా వాటిని తట్టుకుని మరి పార్టీలోనే ఉంటున్నారు.
ఇక ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు రావడంతో అధికార పార్టీ నుంచి ఈ ముగ్గురు ఎమ్మెల్యేలపై ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా వీరు మాత్రం వెనక్కు తగ్గకుండా జిల్లాలో వైసీపీని ఢీ అంటే ఢీ అనే రేంజ్లో ఢీ కొడుతున్నారు.అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు, కొండపి ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి దూకుడుకు కట్టడి వేయాలని జగన్ ఎన్నోసార్లు ప్రయత్నాలు చేశారు.
వీరిలో గొట్టిపాటి గ్రానైట్ వ్యాపారాలపై పదే పదే విజిలెన్స్ దాడులు జరుగుతున్నాయి.ఆయన ఆర్థికంగా ఎంతో నష్టపోయారు.

ఇక పరుచూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు చెందిన కంపెనీల ఉత్పత్తులు ఏపీలో అమ్ముడు అవ్వకుండా ప్రభుత్వ పెద్దల నుంచే ఒత్తిళ్లు ఉండడంతో అవి కూడా నిలిచిపోయాయి.పైగా ఆయన్ను చంద్రబాబు బాపట్ల పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా కూడా నియమించారు.దీంతో ఆయన మరింత దూకుడుగా ముందుకు వెళుతున్నారే తప్పా ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు.ఇక కొండపి ఎమ్మెల్యే స్వామిని కట్టడి చేసే ప్రయత్నాలు సీఎం స్థాయి నుంచి జరుగుతున్నా ఆయనా వెనక్కు తగ్గడం లేదు.
పార్టీ పెద్దలు గత యేడాది జడ్పీటీసీ ఎన్నికల్లో అద్దంకిలోని సంతమాగలూరు, కొండపిలోని సింగరాయకొండ, కందుకూరులోని కందుకూరు జడ్పీటీసీలు ఏకగ్రీవం అయ్యేలా చక్రం తిప్పారు.ఆ తర్వాత వీరిని మరింత టార్గెట్ చేసినా వీరు మాత్రం వెనక్కు తగ్గడం లేదు.
స్థానిక పంచాయతీ ఎన్నికల్లో మరింత దూకుడుగా తమ పార్టీ అభ్యర్థులను గెలిపించేలా చక్రం తిప్పుతున్నారు.