కోవిడ్తో అల్లాడిపోతున్న అగ్రరాజ్యం అమెరికా.ఈ మహమ్మారిని దేశం నుంచి తరిమికొట్టేందుకు గాను గట్టి సంకల్పంతో పనిచేస్తోంది.
ముఖ్యంగా అధ్యక్షుడు జో బైడెన్ 100 రోజుల ప్రత్యేక కార్యాచరణతో కోవిడ్పై యుద్ధాన్ని ప్రకటించారు.ప్రజలు వ్యాక్సిన్ తీసుకునేందుకు గాను అవగాహన కల్పిస్తున్న బైడెన్ ఈసారి మరో సరికొత్త లక్ష్యాన్ని ప్రజలకు నిర్దేశించారు.
దేశ స్వాతంత్య్ర దినోత్సవమైన జూలై 4 నాటికి ప్రతి అమెరికా పౌరుడు వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.ఒకవేళ దేశమంతా వ్యాక్సిన్ తీసుకుంటే.
జూలై నాలుగవ తేదీన కోవిడ్ నుంచి మనకు స్వాతంత్య్రం వచ్చినట్లే అని బైడెన్ స్పష్టం చేశారు.మే ఒకటో తేదీ నాటికి ప్రతి రాష్ట్రంలో ఉన్న వృద్ధులు టీకాలు తీసుకోవాలని సూచించారు.
ప్రస్తుతం వయసు, ఆరోగ్యం తదితర అంశాల ఆధారంగా టీకాలు ఇస్తున్నామని ఆయన వెల్లడించారు. బైడెన్ పిలుపు మేరకు టెక్సాస్ రాష్ట్రం వ్యాక్సినేషన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.
మార్చి నెలాఖారు నుంచి వయోజనులందరికీ (16 ఏళ్లు పై బడిన వారికి) కొవిడ్ టీకా వేయనున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంగళవారం ప్రకటించింది.రాష్ట్రంలోని వయోజనులందరూ అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ సెంటర్లలో తప్పనిసరిగా టీకా తీసుకోవాలని అధికారులు వెల్లడించారు.
16 ఏళ్లకు పైబడిన వారు ఫైజర్, 18 ఏళ్లకు పైబడిన వారు మొడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ డోసులు తీసుకోవడానికి అర్హులని తెలిపారు.ఇప్పటి వరకు టెక్సాస్లో కోటి మందికి వ్యాక్సినేషన్ జరిగిందని వైద్య శాఖ ప్రకటించింది.
వయోబేధం లేకుండా అన్ని వయస్సుల వారికి కరోనా వ్యాక్సిన్ అందిస్తున్న రాష్ట్రాలలో అలాస్కా, ఆరిజోనా, మిస్సిసిప్పీల తొలి మూడు స్థానాల్లో వుండగా.నాల్గో స్థానంలో టెక్సాస్ నిలిచింది.
అటు మరో రాష్ట్రం కనెక్టికట్ కూడా 16 ఏళ్లకు పైబడిన వారందరికీ ఏప్రిల్ 5 నుంచి టీకాలు ఇస్తామని వెల్లడించింది.
మరోవైపు ఆస్ట్రాజెనెకా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కలిసి సంయుక్తంగా తయారు చేసిన వ్యాక్సిన్ వల్ల దుష్పరిణామాలు వస్తున్న నేపథ్యంలో పలు దేశాలు ఆ టీకాను నిషేధించిన సంగతి తెలిసిందే.ఈ తరుణంలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్పై ఉన్న అనుమానాలను నివృత్తి చేస్తూ అమెరికా ఆరోగ్య శాఖ డేటాను ప్రచురించింది.కోవిడ్ను అరికట్టడంలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ 79% ప్రభావవంతంగా పనిచేస్తుందని స్పష్టం చేసింది.