తెలంగాణాలో ఫలితాలు వెలువడిన దగ్గర నుంచీ… టీడీపీకి చెందిన సత్తుపల్లి ఎమ్యెల్యే సండ్ర వీరయ్య.అశ్వారావుపేట ఎమ్యెల్యే మచ్చా నాగేశ్వరరావు టీఆర్ఎస్ పార్టీలో చేరిపోతున్నారు అనే ప్రచారం జోరుగా సాగింది.
అయితే ప్రచారాన్ని సండ్ర వీరయ్య మొహమాటంగా ఖండించగా… మచ్చా నాగేశ్వరరావు మాత్రం గట్టిగానే ఖండించడమే కాక తాను టీడీపీలోనే ఉంటాను అంటూ… చంద్రబాబు ని సైతం కలిసి క్లారిటీ ఇచ్చేసాడు.
అయితే ఇంతలోనే ఏమైందో ఏమో కానీ .తాజాగా … మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత తుమ్మల నాగేశ్వరరావుతో భేటీ అయ్యారు… దీంతో మరోసారి నాగేశ్వరరావు గులాబీ కండువా కప్పుకోవడం ఖాయమనే ప్రచారం జోరందుకుంది.తుమ్మలతో భేటీ విషయాన్ని నాగేశ్వరరావు ధృవీకరించారు.
తాను తుమ్మలను పరామర్శించడానికి వెళ్లానని చెప్పుకొచ్చారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అశ్వారావుపేట నియోజకవర్గం నుంచి విజయం సాధించిన మచ్చా నాగేశ్వరరావు… ఇవాళ సత్తుపల్లి మండలం పాకలగూడెంలోని తుమ్మల గెస్ట్ హౌస్ లో ఆయనతో భేటీ అయ్యారు.
టీఆర్ఎస్లో చేరనున్నట్టు ప్రచారం ఈ సమయంలోనే ఈ భేటీ జరగడం అనేక అనుమానాలకు దారితీస్తోంది.