కేంద్రంలో అధికారంలోకి రాగలము అనే నమ్మకం ఇప్పుడే కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తోంది.దేశవ్యాప్తంగా బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుడడంతో పాటు, కాంగ్రెస్ పార్టీకి వ్యూహాల అందించే బాధ్యతను ప్రశాంత్ కిషోర్ తీసుకోవడం తో తప్పకుండా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ పెద్దల్లో ధీమా కనిపిస్తోంది.
అంతేకాకుండా కాంగ్రెస్ లో చేరేందుకు ప్రశాంత్ కిషోర్ సిద్ధంగా ఉండడం తో, పార్టీలో చేరగానే ఆయనకు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి అప్పగించేందుకు సోనియా సముఖత వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉంటే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచేందుకు ఏ ఏ ప్రణాళికను అమలు చేయాలనే విషయంపై ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ తగిన సూచనలు చేశారు.
ప్రశాంత్ కిషోర్ సూచనలపై సోనియా పార్టీ సీనియర్ నేతలు ఏకే ఆంటోనీ, అంబికా సోనీ, మల్లికార్జున్ ఖర్గే లతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ త్రిసభ్య కమిటీ ప్రశాంత్ కిషోర్ కి చేసిన సూచనలపై అధ్యయనం చేసి , వారంలోగా సోనియాకు నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.
ఈనెల 16వ తేదీన సోనియాతో ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు.దాదాపు మూడు గంటల పాటు అనేక అంశాలపై చర్చించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి రావాలి అంటే.ఏం చేయాలనే విషయంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సోనియాకు పీకే వివరించారు.
ఈ సమావేశంలో రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ, సీనియర్ కాంగ్రెస్ నేతలు ఏకే ఆంటోనీ, అంబికా సోనీ మల్లికార్జున ఖర్గే, దిగ్విజయ్ సింగ్, ముకుల్ వాస్నిక్, , కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్, అజయ్ మాకెన్, తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఏం చేసింది అనే విషయంపై ప్రశాంత్ కిషోర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.ఈ సందర్భంగా పార్టీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి అనే దానిపైన సూచనలు చేశారు.రాబోయే లోక్ సభ ఎన్నికల్లో గెలవగలిగిన స్థానాల్లో మాత్రమే వనరులను ఖర్చు చేయాలని, ఇప్పటి వరకు సరైన మార్కెటింగ్ విధానం లేకుండా కాంగ్రెస్ ఉండిపోయిందని, కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగే విధంగా చేయడం వంటి విషయాలపై దృష్టి పెట్టాలని, ఉత్తరప్రదేశ్ , బీహార్ వంటి రాష్ట్రాల్లో సొంతంగా పోటీచేయాలని ఆంధ్ర ,తెలంగాణ, పశ్చిమ బెంగాల్ , మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో పొత్తు పెట్టుకోవాలని ప్రశాంత్ కిషోర్ సూచించారట.
ఇలా పీకే చెప్పిన ఎన్నో అంశాల పైనే ఇప్పుడు సోనియా త్రిసభ్య కమిటీని నియమించారట.