ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సిబిఐ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ హత్య వ్యవహారంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సంబంధం ఉన్నట్లుగా సిబిఐ సాక్ష్యాధారాలు సేకరించడం రాజకీయంగా సంచలనం రేకెత్తిస్తోంది.
ఈ వ్యవహారంలో ఏపీ సీఎం జగన్ తో పాటు, ఆయన భార్య భారతి పేరును ప్రస్తావిస్తూ విపక్ష పార్టీలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న క్రమంలో, ప్రభుత్వ సలహాదారు , జగన్ కు అత్యంత సన్నిహితుడైన సజ్జల రామకృష్ణారెడ్డి ఈ వ్యవహారంపై స్పందించారు.వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదని, దానికి సంబంధించిన ఆధారాలు కూడా లేవని, హత్య జరిగిన సమయంలో ఏపీలో అధికార పార్టీగా టిడిపి ఉందని సజ్జల పేర్కొన్నారు.
అంతేకాదు ఈ కేసులో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బీటెక్ రవికి సంబంధం ఉన్నట్లుగా ఆధారాలు ఉన్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.వాస్తవంగా వివేక బావమరిది శివ శంకర్ రెడ్డి ఫోన్ చేస్తేనే అవినాష్ రెడ్డి హత్య స్థలానికి వెళ్లారని, శివశంకర్ రెడ్డి కూడా ఎటువంటి తప్పు చేయలేదని తాము భావిస్తున్నామని సజ్జల పేర్కొన్నారు.ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలు చూస్తే, జగన్ టార్గెట్ చేసుకుని , ఆయన్ను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోందని , జగన్ కుటుంబానికి వివేకానందరెడ్డి తో సంబంధం ఉందని సజ్జల గుర్తు చేశారు .టిడిపి చంద్రబాబు లైన్ కు అనుగుణంగా సిబిఐ లో కిందిస్థాయి అధికారులు పనిచేస్తున్నారని, నిష్పక్షపాతంగా వారు పనిచేయకపోగా , కల్పిత వాంగ్మూలాలను సృష్టించి జగన్ ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు.
సిబిఐ ప్రకటన వెనుక రాజకీయ ప్రమేయం ఉందని సజ్జల ఆరోపించారు.వివేకానంద రెడ్డి మరణాన్ని అడ్డం పెట్టుకుని జగన్ పై కుట్రలు చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు.వివేక మరణం తర్వాత శివప్రకాష్ రెడ్డి అక్కడ దొరికిన లేఖ అనుమానాస్పదంగా ఉందని ఎందుకు చెప్పలేదని సజ్జల ప్రశ్నించారు .వివేకా హత్య కేసులో బాబుదే మాస్టర్ మైండ్ అంటూ సజ్జల విమర్శలు చేశారు.వివేకా హత్య కేసును పక్కదారి పట్టించేందుకు అవినాష్ రెడ్డి , భాస్కర రెడ్డి, భారతమ్మ పేర్లను ప్రస్తావించడం కుట్రపూరితమంటూ సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ కేసులోను బిజెపి లో కోవర్ట్ లుగా ఉన్న తన మనుషుల ద్వారా చంద్రబాబు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని సజ్జల అనుమానం వ్యక్తం చేశారు.