రాజన్న సిరిసిల్ల జిల్లా : ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మిల్లులో ధాన్యం దించుకొని రైస్ మిల్లర్లు సహకరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు.జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం లోని ఆడిటోరియంలో జిల్లాలోని రా, బాయిల్డ్ రైస్ మిల్లుల బాధ్యులతో బుధవారం కలెక్టర్, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రైస్ మిల్లర్లకు రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు వివరించారు.అనంతరం రైస్ మిల్లర్ల అంశాలపై చర్చించారు.
తమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు, బ్యాంక్ గ్యారంటీ, టెస్ట్ మిల్లింగ్, బియ్యం అందించే గడువు పెంచాలని, గన్ని బ్యాగుల సమస్య పరిష్కరించాలని రైస్ మిల్లర్లు కోరారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడారు.
రైతుల సౌకర్యార్థం జిల్లాలో ఇప్పటిదాకా 152 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని తెలిపారు.ఇంకా అవసరం మేరకు మరిన్ని కేంద్రాలు ప్రారంభిస్తామని వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు రైస్ మిల్లర్లు సహకరించి, ధాన్యం తీసుకోవాలని సూచించారు.మిల్లర్లు తమ దృష్టికి తీసుకువచ్చిన అంశాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామని తెలిపారు.
రైతుల ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని రైస్ మిల్లర్లు వెంటనే ధాన్యం దిగుమతి చేసుకొని సహకరించాలని కోరారు.
ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి వసంతలక్ష్మి, జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్ రజిత, డిప్యూటీ తహసీల్దార్లు (సిఎస్) మరియు రా, బాయిల్డ్ రైస్ మిల్లుల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.







