మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి ప్రధాని నరేంద్ర మోడీని గట్టిగా సవాల్ చేశారు.చేతనైంది చేసుకోండి అని తొడ కొట్టారు.
తనపై బీజేపీ, ఆరెసెస్ చేస్తున్న ఆరోపణల మీద విచారణ జరిపించి, ఆరోపణలు రుజువు అయితే జైల్లో పెట్టండి అని సవాల్ చేశారు.రాహుల్ బ్రిటిష్ సిటిజెన్ అని, ఆయన కమీషన్ ఏజెంటు అని బీజేపీ నాయకుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి ఆరోపణలు చేసిన నేపధ్యంలో రాహుల్ తీవ్రంగా స్పందించారు.
మోదీజీ నేను మీకు ఒకటి చెప్పదలచుకున్నాను.ఈ ప్రభుత్వం మీది.
మీకు అనేక దర్యాప్తు సంస్థలు ఉన్నాయి.వాటితో నా మీద దర్యాప్తు చేయించండి.
మీ 56 ఇంచీల చాతీ చూపించండి.ఆరు నెలల లోపల ఆరోపణలు నిజమని తేలితే నన్ను జైల్లో పెట్టండి … అని రాహుల్ సవాల్ చేశారు.
బీజేపీ, ఆరెసెస్ నాయకులు తన నాయనమ్మ మీద, తండ్రి మీద, తల్లి మీద ఆరోపణలు చేయడం చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అని రాహుల్ అన్నారు.మోడీ సర్కారు రాహుల్ మీద దర్యాప్తు చేస్తుందో, లేదో చెప్పలేముగానీ మోడీని రాహుల్ బహిరంగంగా సవాల్ చేయడం కాంగ్రెస్ నాయకులకు ఉత్సాహం కలిగిస్తోంది.
సుబ్రమణ్య స్వామి మాత్రం రాహుల్ను గట్టిగా పట్టుకున్నారు.ఆయన మీద తాను చేసిన ఆరోపణలపై సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.