మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయంలో రూ.856 కోట్లతో చేపట్టిన ‘శ్రీ మహాకాళ్ లోక్’ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు.ఆలయ అభివృద్ది పనుల్లో భాగంగా 900 మీటర్ల మేర ఆలయ ఆవరణను విస్తరించి అత్యద్భుతంగా తీర్చిదిద్దారు.గుజరాత్ పర్యటన నుంచి మోదీ నేరుగా ఉజ్జయిని చేరుకున్నారు.గవర్నర్ మంగుభాయ్ పటేల్, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రధానికి స్వాగతం పలికారు.సంప్రదాయ దుస్తులైన ధోతీ, గంచాతో గర్భగుడిలోకి మోదీ ఒంటరిగా ప్రవేశించారు.
మోదీ పూజా కార్యక్రమాలు దాదాపు 20 నిమిషాలపాటు కొనసాగాయి.మెడలో రుద్రాక్షమాల, చేతిలో బిల్వ పత్రాలతో మోదీ పది నిమిషాలపాటు ధ్యానంలో గడిపారు.
నంది వద్దకు వెళ్లి నమస్కరించి, హుండీలో కొంత డబ్బు వేశారు.ఉజ్జయిని మహాకాళ్ చాలా ప్రత్యేకతలు కలిగి ఉంది.మహాకాళ్ కారిడార్ ఖర్చు రూ.856 కోట్లు కాగా దీని పొడవు 900 మీటర్లు.దేశంలోనే అతిపెద్ద కారిడార్ అని చెప్పుకోవచ్చు.రుద్రసాగర్ చెరువు చుట్టూ కారిడార్ నిర్మాణం, శిల్పకళ ఉట్టిపడేలా 108 స్తంభాల నిర్మాణం, 50 కుడ్య చిత్రాల్లో శివపురాణం,మ్యూజికల్ ఫౌంటేన్ నిర్మాణంతో పాటు ఏకకాలంలో 2 లక్షల మంది దర్శించుకునే అవకాశం కల్పించేలా నిర్మాణాలు చేశారు.







