అవినీతిని సహించేది లేదని పదే పదే చెప్పుకొనే ఏపీ సీఎం చంద్రబాబు కేబినెట్లో అత్యంత కీలకమైన వ్యవసాయ శాఖను నిర్వహిస్తున్న మంత్రి ప్రతిపాటి పుల్లారావుపై ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.దాదాపు వెయ్యి కోట్లకు పైగా అవినీతి జరిగిందని భావిస్తున్న సీసీఐ పత్తి కుంభకోణానికి సంబంధించి పుల్లారావు పేషీ కీలకంగా వ్యవహరించిందని, ముడుపులు మెక్కిందని టాక్ వినిపిస్తోంది.
పత్తి కొనుగోళ్లలో ప్రధాన కేంద్రంగా ఉన్న గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పెద్ద ఎత్తున పత్తి కుంభకోణం జరిగింది.
రైతుల నుంచి పత్తిని తక్కువ ధరలకు కొనుగోలు చేసి, వాటిని ఎక్కువ ధరకు కొన్నట్టు రికార్డులు సృష్టించడం, కొందరు రైతుల దగ్గరనుంచి పత్తిని కొన్నట్టు రికార్డులు సృష్టించినా.
వాస్తవ స్థితిలో అసలు రైతులు లేకపోవడం వంటివి వెలుగు చూశాయి.ఫలితంగా మార్కెటింగ్ శాఖ అధికారులు, దళారులు కుమ్మక్కయి.
దాదాపు 1000 కోట్ల వరకు బొక్కారని తెలుస్తోంది.ఇప్పటికే దీనిపై ఇంటిలిజెన్స్ పరిశోధన పూర్తికాగా, సీబీఐ విచారణ సాగుతోంది.
ఈ విచారణ ఆధారంగానే ఇప్పటికి మంత్రి పుల్లారావు చేతిలోని మార్కెటింగ్ శాఖకు చెందిన 20 మంది అధికారులు(వీరిలో ఉన్నతస్థాయి వారూ ఉన్నారు) సస్పెండ్ అయ్యారు.
ఈ కుంభకోణంలో మరో ముఖ్యకోణం ఏమంటే.
మంత్రి ఏరికోరి నియమించుకున్న రిటైర్డ్ అధికారిని ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్డీ) కింద నియమించుకున్నారట.ఈయనపై గతంలోనూ అవినీతి ఆరోపణలు ఉన్నాయి.
ఇప్పుడు పత్తి కుంభకోణానికి సంబంధించి ఈ అధికారి పేరు ప్రధానంగా వినిపిస్తోంది.ఇక, గుంటూరు జిల్లాలో ఒక మండల ఎండీవో ఒకరు కుంభకోణంలో కీలక పాత్ర పోషించారట.
మంత్రి పుల్లారావుకి అంతరంగిక వ్యవహారాలు చక్కదిద్దే మరో అధికారి కూడా ఈ కుంభకోణంలో ముఖ్య భూమిక వహించాడట.
ఇంతగా రూ.కోట్లలో కాదు వందల కోట్లలో అవినీతి జరిగితే.మంత్రిగారికి తెలియకుండానే ఉంటుందా? అన్నది ప్రధాన ప్రశ్న.ఇక, మంత్రిగారి అధికారులే కాకుండా ఈయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈయన సతీమణి, బావమరిది కూడా చెలరేగిపోతున్నట్టు టాక్ నడుస్తోంది.ఇక, ఈ విషయాలన్నీ సీఎం చంద్రబాబు పేషీకి చేరాయని సమాచారం.
అయితే, ప్రస్తుతం ఆయన బిజీగా ఉండడం, మరోపక్క పత్తి కొనుగోళ్ల కుంభకోణానికి సంబంధింది సీబీఐ విచారణ సాగుతుండడంతో ఆయన మౌనంగా ఉన్నట్టు తెలుస్తోంది.మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి.