2024 ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కాకూడదు అని కోరుకునే వారు ఎవరైనా ఉన్నారా అంటే, అది టిడిపి అధినేత చంద్రబాబు .ఆయన కంటే ఎక్కువగా జగన్ ను మొదటి నుంచి ద్వేషిస్తూ, ఆయన ఎప్పటికీ అధికారంలోకి రాకూడదు అని కోరుకునే వారిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందుంటారు.
మొదటినుంచి జగన్ విషయంలో పవన్ వైఖరి ఇదే విధంగా ఉంటూ వస్తోంది.జగన్ ప్రభుత్వ తీరును పవన్ ఎప్పుడు మెచ్చుకొలేదు.
విమర్శలతో విరుచుకుపడుతూ ఉంటారు.టిడిపి ప్రభుత్వ హయాంలో పవన్ కొన్ని విషయాలు మాత్రమే అప్పుడప్పుడు టిడిపిని విమర్శించేవారు.
చాలా వివాదాస్పదమైన అంశాలలోనూ పవన్ పెద్దగా నోరు మేదిపే వారు కాదు.కానీ జగన్ విషయంలో అలాకాదు.చిన్న విషయమైనా, పెద్దదైన జగన్ పరపతి తగ్గించడమే ఏకైక లక్ష్యంగా పవన్ అడుగులు వేస్తున్నారు. 2024 నాటికి ఏదోరకంగా జనసేన ను బలోపేతం చేసి, తమ పార్టీ అధికారంలోకి వచ్చేలా చూడాలనేది పవన్ ఆకాంక్ష.
సొంతంగా అధికారంలోకి రాకపోయినా , ఎవరైనా అధికారంలోకి రావాలంటే తప్పనిసరిగా తమ మద్దతు తీసుకునే స్థాయిలో బలపడాలి అనేది పవన్ అభిప్రాయం.అందుకే ఇప్పటి నుంచే వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, ప్రజా పోరాటాలను చేస్తూ వస్తున్నారు.
ఈ విషయంలో జగన్ శత్రువులు అందరినీ ఏకం చేసి, తన పంతం నెరవేర్చుకోవాలని చూస్తున్నారు. జనసేన ,టిడిపి మాత్రమే కాకుండా వైసీపీ లోనే ఉంటూ రెబల్ గా మారిన ఎంపీ రఘురామకృష్ణంరాజు నిత్యం జగన్ ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు.
టిడిపి జనసేన కంటే ఎక్కువగా వైసీపీకి నష్టం కలిగేలా రఘురామకృష్ణంరాజు విమర్శలు చేస్తున్నారు.అటువంటి రఘురామకృష్ణంరాజు పవన్ ఓ వివాహ వేడుకలో పాల్గొన్న సందర్భంగా కలిసి మాట్లాడుతున్నారు.ఈ సందర్భంగా వారిద్దరూ భేటీకి సంబంధించి ఫోటోలు బయటకు వచ్చాయి.రఘురామకృష్ణంరాజు టీడీపీతో సన్నిహితంగా మెలుగుతున్నారు అనే విషయం గతంలోనే బయటకు వచ్చింది .టిడిపి రఘురామ మధ్య జరిగిన వాట్సాప్ మెసేజ్ లు అన్ని సిబిసిఐడి బయటపెట్టింది.ఒకరకంగా టీడీపీతో సన్నిహితంగా రఘురామ మెలుగుతున్నట్టుగా అందరికీ అర్థమైపోయింది.
అటువంటి వ్యక్తితో జనసేన అధినేత పవన్ ముచ్చటించడం తో, జగన్ అధికారంలోకి రాకుండా చేసేందుకు ఆయన శత్రువులు అందరినీ ఏకం చేసి , తన పంతం నెగ్గించుకోవాలి అనేది పవన్ అభిప్రాయంగా కనిపిస్తోంది .ఎవరు ముఖ్య మంత్రి అయినా పర్వాలేదు, జగన్ మాత్రం ముఖ్యమంత్రి అవ్వకూడదు అనేదే పవన్ ఏకైక లక్ష్యంగా కనిపిస్తోంది.