మహారాష్ట్రలో మరోసారి రాజకీయ వేడి రగులుకుంది.ఇటీవల శివసేన పార్టీలో చీలికలు మహారాష్ట్ర రాజకీయాలను అతలాకుతలం చేశాయి.
తాజాగా మహారాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీ సంచలన వ్యాఖ్యలు చేశారు.గుజరాతీలు, రాజస్థానీలు మహారాష్ట్రను విడిచి వెళ్లితే ఈ రాష్ట్రంలో డబ్బేం మిగలదన్నారు.
అప్పుడు రాష్ట్రం దివాలా తీస్తుందని గవర్నర్ వ్యాఖ్యానించడం ఇప్పుడు మహారాష్ట్రలో మరోసారి చిచ్చురేపింది.గుజరాతీలు, రాజస్థానీలు మరీ ముఖ్యంగా ముంబై, ఠాణె నగరాలను విడిచివెళ్లిపోతే ఈ రాష్ట్రంలో డబ్బేం మిగలదని గవర్నర్ వివరించారు.
అప్పుడు ముంబై నగరానికి దేశ వాణిజ్య రాజధానిగా ఉండే అర్హత ఉండదన్నారు.
ముంబైని ఆర్ధిక రాజధానిగా మార్చడంలో గుజరాతీలు, రాజస్థానీల సహకారం ఎంతో ఉందని గవర్నర్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
అయితే గవర్నర్ చేసిన వ్యాఖ్యలను శివసేన నేత సంజయ్ రౌత్ తప్పుపట్టారు.రాష్ట్ర ప్రజలను గవర్నర్ అవమానించారని ఆయన ఆరోపించారు.
గవర్నర్ తన మాటలతో కష్టపడి పనిచేసే మహారాష్ట్ర ప్రజలను అవమానించారంటూ సంజయ్ రౌత్ విమర్శలు చేశారు. బీజేపీ మద్దతు పొందిన ముఖ్యమంత్రి అధికారంలోకి రాగానే మరాఠీ వ్యక్తి అవమానానికి గురవుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం ఏక్నాథ్ షిండే గవర్నర్ వ్యాఖ్యలను ఖండించాలంటూ డిమాండ్ చేశారు.అంతేకాకుండా సీఎం షిండేకు ఆత్మాభిమానం ఉంటే గవర్నర్ రాజీనామా చేయాలంటూ కోరాలని సూచించారు.

అటు గవర్నర్ కోశ్యారీ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత సచిన్ సావంత్ కూడా తీవ్రంగా తప్పుబట్టారు.ఈ మేరకు ఆయన ఓ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు.రాష్ట్ర ప్రజలను గవర్నర్ అవమానించటం చాలా బాధాకరమన్నారు.ఆయన పదవీ కాలంలో గవర్నర్ అధికారాలు, మహారాష్ట్ర రాజకీయ సంప్రదాయాలు దెబ్బతినటమే కాదు.రాష్ట్రాన్ని తరుచుగా అగౌరవపరుస్తున్నారని మండిపడ్డారు.గవర్నర్ వెంటనే మహారాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని శివసేన ఎంపీ ప్రియాంక ఛతుర్వేది డిమాండ్ చేశారు.
కాగా గవర్నర్ కోశ్యారీ నోటి నుంచి ఈ తరహా వ్యాఖ్యలు రావడం ఇదే మొదటిసారేం కాదు.గతంలో కరోనా లాక్డౌన్ నిబంధనల సడలింపుల విషయంలో ఆయనకు, అప్పటి ఉద్ధవ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం నడిచింది.
అయితే ఇటీవల ప్రభుత్వం మారింది.బీజేపీ మద్దతుతో శివసేన పార్టీ అసమ్మతి నేత ఏక్నాథ్ షిండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.