బీహార్ సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వానికి ఈనెల 24న అసెంబ్లీలో బల పరీక్ష జరగనుంది.మొత్తం ఏడు పార్టీలకు చెందిన 164 మంది ఎమ్మెల్యేలు మద్ధతిస్తున్నట్లు గవర్నర్ ఫాగు చౌహాన్ కు ఇచ్చిన లేఖలో నితీశ్ తెలిపారు.
జేడీయూ – ఆర్జేడీ- కాంగ్రెస్ – సీపీఐ ఎంఎల్ ఇతర పార్టీల మద్ధతుతో నితీశ్ ప్రభుత్వం ఈనెల 10న కొలువు తీరగా.సీఎంగా నితీశ్, డిప్యూటీ సీఎంగా తేజస్వీ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.
అటు మంత్రివర్గ విస్తరణపై చర్చలు జరుగుతున్నాయి.దీనిలో భాగంగా మొత్తం 35 మంది ఎమ్మెల్యేలకు మంత్రులుగా అవకాశమివ్వాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.జేడీయూ నుంచి 13 మందికి, ఆర్జేడీ నుంచి 16 మందికి అవకాశం ఇవ్వనున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురితో పాటు జితన్ రామ్ మాంజీకి చెందిన హెచ్ ఏ ఎం పార్టీకి ఒక మంత్రి పదవి దక్కనున్నట్లు సమాచారం.
అదేవిధంగా ఈనెల 24, 25 తేదీల్లో బీహార్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.కొత్త స్పీకర్ ఎన్నిక కూడా అప్పుడే జరగనుంది.అయితే ప్రస్తుత స్పీకర్ విజయ కుమార్ సిన్హా రాజీనామాకు ఒప్పుకోకపోవడంతో అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించారు.