తెలంగాణ నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య గతేడాది డిసెంబర్లో మృతి చెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.ఈ క్రమంలో ప్రధానంగా మూడు పార్టీలు బరిలోకి దిగేందుకు రంగం సిద్దం చేసుకున్నాయి.
ఇక నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నామినేషన్లకు ఈ రోజే చివరి రోజు కావడంతో పలు పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు నామినేషన్ దాఖలు చేసేందుకు తరలివచ్చారు.అయితే అభ్యర్థి పేరును ఖరారు చేసే విషయంలో టీఆర్ఎస్ ఆచితూచి అడుగులు వేసి చివరికి నోముల భగత్ కుమార్ ను బరిలోకి దించేందుకు సిద్దం అయ్యింది.
ఈ నేపధ్యంలో నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లిన నోముల భగత్ కుమార్ వెంట తెలంగాణ మంత్రులు మహముద్ అలీ, జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు కూడా ఉన్నారట.ఇదిలా ఉండగా కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి కూడా నామినేషన్ దాఖలు చేశారు.
బీజేపీ అభ్యర్థి డాక్టర్ పానుగోతు రవికుమార్ కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారని సమాచారం.
ఇక నేటి మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉన్న నామినేషన్ల దాఖలుకు ఇప్పటి వరకు మొత్తం 20 మందికిపైగా నామినేషన్లు వేశారని సమాచారం.
ఇకపోతే రేపు నామినేషన్ల పరిశీలన జరపనుండగా, ఏప్రిల్ 3 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది.