రాజకీయంగా కొట్లాటలు ఎన్నికల వరకే.ఆ తరువాత కథ మర్యాదపూర్వకంగా ఉంటుంది అంటున్నారు బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న జేడీయూ నాయకుడు నితీష్ కుమార్.
ఎన్నికల్లో మోడీతో హోరాహోరీ తలపడి, తీవ్రంగా విమర్శలు చేశారు.ఆయన విధానాలను కడిగి పారేశారు.
ఆయన వైఖరిని దుయ్యబట్టారు.ఇప్పుడు అదంతా గతం.ముగిసిన కథ.ఇక మర్యాద పూర్వకంగా వ్యవహరించాలి.అందుకే ఈ నెల 20వ తేదీన జరగబోయే తన ప్రమాణ స్వీకారానికి రావలసిందిగా ప్రధాని మోడీని నితీష్ ఆహ్వానించారు.ప్రధానికి టెలిఫోన్ చేసి కార్యక్రమానికి రావాలని కోరారు.
మోడీ రారనే సంగతి నితీష్కు తెలుసు.కానీ మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.
సంప్రదాయం పాటించారు.మోడీ తాను రానని నేరుగా చెప్పారు కదా.ఆయన తరపున బీజేపీ బిహార్ ఉపాధ్యక్షుడు మాట్లాడుతూ ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్నందున మోడీ రాలేక పోవచ్చని చెప్పారు.కాషాయ పార్టీ కురు వృద్ధుడు అద్వానీని, ఎంపీ శత్రుఘ్ను సిన్హాను ఆహ్వానించారు.
ప్రమాణ స్వీకారానికి మోడీని, అమిత్ షాను పిలవరనే వార్తలు వచ్చాయి.కానీ పిలిచారు.
కేంద్ర ప్రభుత్వం తరపున మంత్రులు వెంకయ్య నాయుడు, రాజీవ్ ప్రతాప్ రూడీ హాజరు అవుతారని సమాచారం.