ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్తో( Budget ) వేతన జీవులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం న్యూ ఇన్కం ట్యాక్స్ బిల్లు 2025ను( New Income Tax Bill 2025 ) పార్లమెంట్లో ప్రవేశపెట్టింది.దశాబ్ధాల నాటి పాత ఆదాయపు పన్ను చట్టం స్థానంలో దీనిని తీసుకొస్తోంది.1961 నాటి పాత చట్టానికి పలుమార్లు 66 సవరణలు జరిగాయి.ఈ చట్టాన్ని సరళతరం చేస్తామని మోడీ ప్రభుత్వం గతంలోనే ప్రకటించి ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంది.
ఇందుకోసం కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఒక అంతర్గత కమిటీని ఏర్పాటు చేసింది.మొత్తంగా 6500 సలహాలను అందుకున్న ఆదాయపు పన్ను శాఖ కొత్త బిల్లును రూపొందించింది.
అయితే ఈ కొత్త ఆదాయపు పన్ను బిల్లులో ప్రవాస భారతీయుల కోసం ఎలాంటి సవరణలు తీసుకొస్తున్నారు? వారికి ఊరట కలిగించే పనులు చేపడుతున్నారా? అని ఎన్ఆర్ఐలు( NRI’s ) ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.అయితే పన్ను చట్రాన్ని సరళీకృతం చేయడంతో పాటు ప్రవాస భారతీయుల సమస్యలను పరిష్కరించేందుకు ఈ బిల్లులో కొన్ని అంశాలను చేర్చినట్లుగా వార్తలు వస్తున్నాయి.
కొత్త బిల్లు ఎన్ఆర్ఐలకు పన్ను నివాస ప్రమాణాలను కొనసాగిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.సంక్లిష్టమైన రెసిడెన్షియల్ స్టేటస్( Residential Status ) విభాగంలో ఎన్ఆర్ఐలకు కొన్ని మార్గదర్శకాలను పొందుపరిచినట్లుగా తెలుస్తోంది.

అలాగే భారతదేశంలో రూ.15 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ సంపాదించి , మరెక్కడా పన్నులు చెల్లించని వ్యక్తులను ‘‘నివాసి కానీ , సాధారణ నివాసి కాదు’ (ఆర్ఎన్ఓఆర్) వర్గీకరించడం కొనసాగుతుంది.అలాంటి వ్యక్తులు కేవలం భారతదేశంలో సంపాదించిన ఆదాయంపై మాత్రమే పన్నులు చెల్లించాల్సిన బాధ్యతను నిర్ధారిస్తుంది.మాజీ సీబీడీటీ సభ్యుడు అఖిలేష్ రంజన్ మాట్లాడుతూ.ఎన్ఆర్ఐ పన్ను విధానంలో ఎటువంటి మార్పులు ఉండే అవకాశం లేదంటున్నారు.కాకపోతే.
వ్యాజ్యాలు తక్కువగా పడటానికి అవకాశం ఉందని తెలిపారు.

భారతదేశంలో ఎన్ఆర్ఐల నివాస స్థితిని అంచనా వేయడమే పన్ను విధానంలో మొదటి అడుగుగా అఖిల్ చంద్నా అనే నిపుణుడు పేర్కొన్నాడు.కొత్త పన్ను బిల్లు ప్రకారం ఎన్ఆర్ఐలకు పన్నుల విధానంలో ఎలాంటి మార్పు ఉండదని అభిప్రాయపడ్డారు.మొత్తం మీద కొత్త బిల్లు పన్ను చెల్లింపులో ఎన్ఆర్ఐల ఆందోళనలను తగ్గించడంతో పాటు స్పష్టత తీసుకొస్తుందని నిపుణులు చెబుతున్నారు.