సూర్యాపేట జిల్లా:వచ్చే హరితహారం కార్యక్రమంలో నీటిపారుదల శాఖ పరిధిలో గల యోగ్యమైన భూములలో విరివిగా మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నీటిపారుదల శాఖ పరిధిలో గల భూములు,కాలువల విస్తీర్ణతపై ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్లు ఎస్.మోహన్ రావు, పాటిల్ హేమంత్ కేశవ్ లతో కలసి పాల్గొన్నారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్.ఎస్.పి.,ఎస్.ఆర్.ఎస్.పి అలాగే మూసినది పరిధిలో గల భూముల హద్దులను రెవెన్యూ శాఖ సహకారంతో నిర్దేశించిన గడువు లోపు గుర్తించాలని సంబంధిత నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు.ఆయా శాఖలు జిల్లా పునర్విభజనకు ముందు ఉన్న కార్యాలయాలలో భూములకు సంబంధించిన రికార్డులను రెవెన్యూ వారి సహకారంతో పరిశీలించి పూర్తిస్థాయి నివేదికలను అందించాలని ఆదేశించారు.
భూములు,కాలువలకు సంబంధించిన మ్యాప్ లను సిద్ధం చేసి సత్వరమే అందించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.గుర్తించిన భూములు,అలాగే కాలువలకు ఇరువైపుల నాటే మొక్కల సంరక్షణకు ఆయా గ్రామాలలో కూలీలను ఏర్పాటు చేసి ఇజిఎస్ ద్వారా చెల్లింపులు చేయడం జరుగుతుందన్నారు.
ముఖ్యంగా ఆక్రమణలు జరిగిన భూముల వివరాలను కూడా సమర్పించాలని ఆదేశించారు.ముందుగా కాలువలకు ఇరువైపులలో గల కంపచెట్లను తొలగించే విధంగా చర్యలు చేపట్టాలని,వచ్చే గురువారం ఏర్పాటు చేసే సమావేశానికి పూర్తిస్థాయి నివేధికలతో హాజరు కావాలని సూచించారు.
అనంతరం మండలాల వారీగా సమీక్షించారు.ఈ సమావేశంలో డిఎఫ్ఓ ముకుందరెడ్డి,నీటిపారుదల శాఖ ఎస్.సిలు సూర్యాపేట నాగేశ్వరరావు,కోదాడ నర్సింహరావు, ఈఈలు భద్రు నాయక్,విజయ్ కుమార్, సత్యనారాయణ,శ్రీనివాస్,డిఈలు,ఏఈలు,ఫీల్డ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.