తెలంగాణాలో మునుపెన్నడూ లేని విధంగా వ్యవసాయం అభివృద్ధి చెందిందని, పంట దిగుబడులు కూడా రైతును ఆర్థిక ప్రగతి వైపు నడిపించేలా వస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇస్తున్న రైతుబంధు, రైతుభీమా పథకాలు రైతులకు ఎంతో భరోసానిస్తున్నాయన్నారు.
వానాకాలం పంటల సాగు యాజమాన్య పద్దతులపై అవగాహన కల్పించేందుకు వీలుగా శుక్రవారం నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మామిడిపల్లిలోని శ్రీ అపురూప వేంకటేశ్వరస్వామి ఆలయం ఆవరణలో గల కళ్యాణ మండపంలో నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లా సదస్సును నిర్వహించారు.
ఈ సదస్సుకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఆయనతో పాటు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఇంకా ఉమ్మడి జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, ఇతర ప్రజా ప్రతినిధులు కూడా సదస్సులో పాల్గొన్నారు.ఈ సదస్సులో మంత్రులు నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డిలు మాట్లాడారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అమలవుతున్న పథకాలతో పాటు, పండించిన పంటకు గిట్టుబాటు ధరలు కూడా ప్రభుత్వం అందిస్తోందని మంత్రులన్నారు.కేంద్రప్రభుత్వంపై విమర్శలు చేశారు.
ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఆయా గ్రామాల రైతుబంధు సమితి సమన్వయకర్తలు, మండల రైతుబంధు కోఆర్డినేటర్లు, జిల్లా రైతు బంధు సమితి సభ్యులు, మార్కెట్ కమిటీల అధ్యక్షులు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, జడ్పీటీసీ ఎంపీటీసీ సభ్యులు , వివిధ సొసైటీ చైర్మన్లు కూడా హాజరయ్యారు.







