భార్యాభర్తలు అన్ని విషయాల్లో కలిసిమెలిసి ఉండాలనే మాటను హైదరాబాద్లోని ఓ జంట నిజజీవితంలోనూ ఆచరించి చూపించారు.అయితే వారేదో ఉత్తమమైన పని చేశారనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే.
ఇంతకీ వారు చేసిన ఘనకార్యం ఏమిటో తెలుసా? రోజూ ఉదయం పాలప్యాకెట్లను చోరీ చేయడం.
హైదరాబాద్ సనత్ నగర్లోని ఫతేనగర్ పైపులైన్ రోడ్డులో లక్ష్మణరావు అనే వ్యక్తి పాల వ్యాపారం చేస్తుంటాడు.
అర్ధరాత్రి పూట వచ్చే పాల ప్యాకెట్లను అన్లోడ్ చేసి ఇంటిముందు పెట్టుకునే వాడు.అయితే కొద్దిరోజులుగా పాలప్యాకెట్లు చోరీకి గురవుతున్నాయనే విషయాన్ని అతడు గుర్తించాడు.దీంతో పాలప్యాకెట్లు ఏమవుతున్నాయో తెలుసుకునేందుకు సీసీ కెమెరా ఏర్పాటు చేయించాడు.
కాగా అదేబస్తీకి చెందిన భార్యాభర్తలు రోజూ తెల్లవారుజామున పాలప్యాకెట్లు చోరీ చేస్తున్నట్లు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.
దీంతో లక్ష్మణరావు పోలీసులను ఆశ్రయించాడు.కాగా పోలీసులు చోరీ కేసులో ఆ భార్యభర్తలను అరెస్ట్ చేసారు.
ఏదేమైనా చోరీలోనూ సమంగా ‘పాలు’పంచుకున్న ఈ జంటను చూసి బస్తీవాసులు ముక్కున వేలేసుకున్నారు.