సిఐటియు – రైతు సంఘం – వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ ఆవిష్కరణ రాజన్న సిరిసిల్ల జిల్లా :కేంద్ర బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక , రైతు , ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిఐటియు – రైతు సంఘం – వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏప్రిల్ 5 న పార్లమెంట్ ముగింపు సమావేశాల సందర్భంగా మద్దూర్ , కిసాన్ సంఘర్ష్ ర్యాలీ పేరుతో చేపడుతున్న చలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ లను ఆదివారం సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ వద్ద రాజన్న సిరిసిల్ల జిల్లా సిఐటియు – రైతు సంఘం – వ్యవసాయ కార్మిక సంఘాల కమిటీల ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ , వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గన్నేరం నర్సయ్య , రైతు సంఘం జిల్లా కార్యదర్శి ముక్తికాంత అశోక్ లు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం దేశంలో ప్రజాస్వామ్య హక్కులను కాలరాసే విధంగా భారత రాజ్యాంగ పరిధిలోని కార్మిక , రైతు , ప్రజా సంక్షేమానికి సంబంధించిన చట్టాలను బడా పెట్టుబడిదారులకు , కార్పొరేట్లకు అనుకూలంగా మారుస్తూ కార్మికులకు , రైతులకు సంకెళ్లు విధిస్తూ హక్కులను హరిస్తూ కట్టు బానిసలుగా మారుస్తుందని మండిపడ్డారు.
అలాగే దేశంలో అనేక సంవత్సరాల నుండి ప్రజలకు సేవలు అందిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు , కార్పొరేట్ శక్తులకు కారు చౌకగా అప్పజెప్పుతూ దేశంలో ప్రజాస్వామ్య విలువలను మంటగలుగుతుందని,దేశంలో ఒకవైపు పేదల సంక్షేమ పథకాలకు నిధులను తగ్గిస్తూ మరోవైపు పెట్టుబడిదారులు , కార్పొరేట్ల రుణాలను మాఫీ చేస్తూ , వడ్డీలను తగ్గిస్తూ రాజ్యాంగ విరుద్ధమైన పాలన కొనసాగిస్తుందన్నారు.దేశంలోనీ పేదల సంక్షేమానికి కృషి చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం నిత్యవసర వస్తువులు , పెట్రోల్ , డీజిల్ , గ్యాస్ ధరలను విపరీతంగా పెంచుతూ పేదలపై భారాలు మోపుతోందని కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న చట్టాలను మార్చి 4 లేబర్ కోడ్ లను తీసుకువచ్చిందని రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని అన్నారు.
ఉపాధి హామీ పథకానికి నిధులను తగ్గించడం జరిగిందని కావున కేంద్ర బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక , రైతు , ప్రజా వ్యతిరేక విధానాలపై ఏప్రిల్ 5 వ.తేదీన దేశంలోని కార్మిక వర్గం , రైతులు , వ్యవసాయ కార్మికులు దాదాపు 10 లక్షల మందితో ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు.కార్మిక కర్షక ఐక్యతతో చట్టాల హక్కుల పరిరక్షణ కోసం జరుగుతున్న ఈ ఛలో ఢిల్లీ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో పనిచేస్తున్న అన్ని రంగాల కార్మికులు , రైతులు వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఈ కార్యక్రమం విజయవంతం కోసం జిల్లాలోని కార్మిక , రైతు శ్రేయోభిలాషులు , ఉద్యోగ ఉపాధ్యాయులు , మేధావులు , వాణిజ్య వ్యాపారస్తులు , ప్రజాప్రతినిధులు , ప్రజానీకం అందరూ తమ వంతు మద్దతు తెలిపి తోడ్పాటు అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి , రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రామంచ అశోక్ , వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు చిలకబాబు , ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సూరం పద్మ , సిఐటియు నాయకులు మోర అజయ్ , అన్నల్దాస్ గణేష్ , గురజాల శ్రీధర్ , గడ్డం రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.