తెలంగాణలో రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి.ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఏ పార్టీలోకి జంప్ చేస్తారో తెలియని పరిస్థితి ఉంది.
ఒకవైపు ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే హడావుడి జరుగుతుండగా, మరోవైపు సాధారణ ఎన్నికల సమయం కూడా దగ్గరకు వచ్చేస్తుండడంతో తెలంగాణ రాజకీయం వేడెక్కుతోంది.ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ నుంచి ఒక్కో నాయకుడు బిజెపిలో చేరుతుండడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
తాజాగా కేంద్ర హోం మంత్రి ,బిజెపి అగ్ర నేత అమిత్ షా తో మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వేరువేరుగా వేటి అయ్యారు.పార్టీ మారే విషయంలో రాజగోపాల్ రెడ్డి కలవగా, వరద సాయంపై కలిసినట్లుగా వెంకటరెడ్డి తెలిపారు.
వరద బాధితుల కష్టాలను అమిత్ షాకు తెలియజేశానని, తెలంగాణలో భారీ వర్షాల వల్ల 1400 కోట్ల నష్టం జరిగిందని, ఈ భేటీకి తాను వెళ్లకపోతే రాష్ట్రానికి నష్టం జరిగేదని వెంకటరెడ్డి పేర్కొన్నారు.ఇప్పటికే వెంకటరెడ్డి బిజెపిలో చేరబోతున్నారనే హడావుడి జరుగుతుండగా, తాను పార్టీ మారడం లేదని, అలా ప్రచారం చేసిన వారికి నోటీసులు ఇస్తానంటూ హెచ్చరికలు కూడా చేసిన సంగతి తెలిసిందే.
ఇది ఇలా ఉంటే, అసలు కాంగ్రెస్ లో వరుస వరుసగా కీలక నాయకులంతా పార్టీని వీడి వెళ్తుండడానికి కారణం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాకూర్ వ్యవహార శైలేనని ఇప్పుడు సీనియర్ నాయకులు చేస్తున్నారు.
ఈ మేరకు మాణిక్యం ఠాకూర్ పై ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి తో పాటు , కోమటిరెడ్డి కుటుంబాన్ని అవమానించే విధంగా మాట్లాడారని, రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరుతుండగా వెంకటరెడ్డి కూడా బిజెపిలో చేరే అవకాశం ఉందని ఈ సందర్భంగా కేసి వేణుగోపాల్ కు సీనియర్ నాయకులు ఫిర్యదు చేసారు.అసలు ఈ వ్యవహారం చోటు చేసుకోవడానికి కారణం మాణిక్యం ఠాగూర్ వ్యవహార శైలేనని, రాజగోపాల్ రెడ్డి వసంతృప్తితో ఉన్నారనే విషయాన్ని అనేకసార్లు మాణిక్యం ఠాకూర్ కు చెప్పామని, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి ,బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు వంటి వారు కూడా ఇదే విషయాన్ని చెప్పినా మాణిక్యం ఠాకూర్ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి హోదాలో ఉన్నా పట్టించుకోలేదని, రేవంత్ ప్రోత్సహించే విధంగానే మాణిక్యం ఠాగూర్ వ్యవహరిస్తున్నారు తప్ప, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే విషయంలోనూ, అసంతృప్తి నాయకులను బజ్జగించే వ్యవహారం పైన దృష్టి పెట్టడం లేదని సీనియర్ నాయకులు కేసు వేణుగోపాల్ కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
కేవలం రాజగోపాల్ రెడ్డి మాత్రమే కాకుండా ఏఐసిసి అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ కూడా కాంగ్రెస్ కు రాజీనామా చేయడం మరి కొంతమంది నేతలు ఆ బాట లో వెళ్లే అవకాశం ఉండడంతో కాంగ్రెస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్ కనిపిస్తోంది.
.