ఖలిస్తాన్ ( Khalistan )వేర్పాటువాద నేత, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్పాల్ సింగ్( Amritpal Singh ) వ్యవహారం భారత్తో పాటు చాలా దేశాల్లో అలజడి రేపుతోంది.ఇతనిని అరెస్ట్ చేయకుండా భారత ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు కొన్ని శక్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా తదితర దేశాల్లో స్థిరపడిన ఖలిస్తాన్ మద్ధతుదారులు భారతీయ దౌత్య కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని నిరసనలకు దిగుతున్నారు.తాజాగా అమెరికా రాజధాని వాషింగ్టన్లో వున్న ఇండియన్ ఎంబసీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.
ఖలిస్తాన్ మద్ధతుదారులు కార్యాలయం వద్దకు చేరుకుని హింసను సృష్టించేందుకు ప్రయత్నించారు.అయితే గడిచిన కొన్ని రోజుల నుంచి దేశంలోని పరిస్థితులను నిశీతంగా గమనిస్తున్న యూఎస్ సీక్రెట్ సర్వీస్, స్థానిక పోలీసులు అప్పటికే ఓ కన్నేసి వుంచారు.
ఈ నేపథ్యంలో వెంటనే జోక్యం చేసుకుని శాన్ఫ్రాన్సిస్కో( San Francisco ), లండన్ తరహా ఘటనలు వాషింగ్టన్లో చోటు చేసుకోకుండా అడ్డుకున్నారు.
శనివారం వాషింగ్టన్ డీసీలోని( Washington DC ) భారత రాయబార కార్యాలయం వెలుపల గుమిగూడిన ఖలిస్తాన్ మద్ధతుదారులు.అమెరికాలోని భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధూని అసభ్యపదజాలంతో దూషించారు.అయితే నిరసనలు జరిగిన సమయంలో ఆయన రాయబార కార్యాలయంలో లేరు.
ఈ నిరసనకు సంబంధించిన దృశ్యాలు మీడియాలో ప్రసారమయ్యాయి.కొందరు హింసను ప్రేరేపించడం, కిటికీ అద్దాలు పగులగొట్టడం అందులో కనిపించింది.
ఉద్రిక్త పరిస్ధితుల నేపథ్యంలో భారత రాయబార కార్యాలయం వెలుపల భారీగా బలగాలను మోహరించారు.
ఇదిలావుండగా.ఈ వారం ప్రారంభంలో శాన్ఫ్రాన్సిస్కోలో వున్న భారతీయ కాన్సులేట్ కార్యాలయంపై ఖలిస్తాన్ వేర్పాటువాదుల తదాడి ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో అక్కడి ఇండియన్ కమ్యూనిటీ స్పందించింది.
భారత దౌత్య సిబ్బందికి, భారతదేశానికి మద్ధతుగా శాంతి ర్యాలీ నిర్వహించారు.శాన్ఫ్రాన్సిస్కోతో పాటు సమీప ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన ప్రజలు త్రివర్ణ పతాకం చేతబూని, భారత్ మాతా కీ జై( Bharat Mata Ki Jai ) అనే నినాదాలతో హోరెత్తించారు.
ఇప్పటికే నెలకొన్న ఉద్రిక్త పరిస్ధితుల నేపథ్యంలో తాజా ర్యాలీకి స్థానిక పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.విషయం తెలుసుకున్న కొందరు ఖలిస్తాన్ అనుకూల వాదులు అక్కడికి చేరుకుని ఖలిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.
దీనికి ప్రతిగా భారతీయులు వందేమాతరం నినాదాలు చేస్తూ కౌంటరిచ్చారు.