ఏపీలో మరో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.అయితే ఇప్పటివరకు ఏపీకి రాజధాని లేకపోవడం ప్రజల దౌర్భాగ్యంగానే పరిగణించాలి.గత ఎన్నికల్లో గ్రాఫిక్స్ రాజధానిని చూపించారని కలత చెంది ప్రజలు టీడీపీని కాదని వైసీపీకి ఓట్లు వేశారు.151 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైసీపీ మూడు రాజధానులు అంటూ ప్రజలకు ఆశ చూపించి ఒక్క రాజధానిని కూడా నిర్మించలేకపోయింది.దీంతో వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ బుద్ధి చెప్పాలని ప్రజలు డిసైడ్ అయిపోయారు.
అందుకే వచ్చే ఎన్నికల్లో రాజధాని ఎమోషనల్ ఇష్యూగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అమరావతి ఏకైక రాజధాని అని హైకోర్టు తీర్పు ఇచ్చినా కూడా ఏపీలో రాజకీయ పార్టీలు ఈ నినాదాన్ని వీడడంలేదు.లేటెస్ట్గా బీజేపీ కూడా రాజధాని అంశాన్ని సొమ్ము చేసుకోవాలని నిర్ణయించింది.
ఈ మేరకు అమరావతి రాజధాని పరిసర గ్రామాలలో ఏకంగా 75 రోజుల పాదయాత్ర చేసేందుకు సిద్ధపడుతోంది.ఈనెల 29న ఉండవల్లి నుంచి బీజేపీ పాదయాత్రను ప్రారంభించనుంది.
అయితే ఆగస్టు నెలలో సీఎం జగన్ విశాఖకు మకాం మారుస్తారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది.అక్కడే క్యాంప్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని ఆయన పాలిస్తారని వైసీపీ నేతలు చెప్తున్నారు.దీంతో వచ్చే ఎన్నికల్లో తాము విశాఖను రాజధానిగా చేశామని చెప్పుకునేందుకు అవకాశం ఉంటుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.అంతే కాకుండా ఉత్తరాంధ్ర ప్రాంతంలో మరోసారి పాగా వేయవచ్చనే ఎత్తుగడ ఫలిస్తుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే అమరావతి రాజధాని ప్రాంతం ఉన్న గుంటూరు, కృష్ణా జిల్లాలలో వైసీపీ గ్రాఫ్ పడిపోయి టీడీపీ గ్రాఫ్ పెరిగిందనే విషయాన్ని అన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.దీంతో అమరావతితో తాము ఏం చేసినా ఓట్లు పడవనే ఉద్దేశంతోనే విశాఖకు మకాం మార్చాలనే ఉద్దేశంతో జగన్ ఈ పని చేస్తున్నారని వైసీపీ నేతలు బహిరంగంగానే చెప్తున్నారు.గతంలో మంత్రి ఆదిమూలపు సురేష్ వంటి నేతలు ఆగస్టులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయని హింట్ ఇచ్చిన విషయాన్ని పలువురు గుర్తుచేస్తున్నారు.