తెలంగాణ ప్రభుత్వం నిరుపేదల కోసం ‘డబుల్ బెడ్రూం ఇళ్ల’ పథకం ప్రారంభించిన సంగతి అందరికీ విదితమే.అర్హులైన వారందరికీ ఇళ్లు అందజేస్తామని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పేర్కొంటూనే ఉన్నారు.
ఈ క్రమంలోనే ‘డబుల్ బెడ్రూం ఇళ్ల’ విషయమై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఒకలా, ఆయన తనయుడు మంత్రి కేటీరామారావు మరొకలా మాట్లాడుతున్నారు.ఇంతకీ వారేమంటున్నారు? అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ స్టోరీని ఫుల్లీ రీడ్ చేయాల్సిందే.
డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు విషయంలో ప్రజాప్రతినిధులు జోక్యం అస్సలు ఉండబోదని, లబ్ధిదారులకు లాటరీ పద్ధతిలో జిల్లా ఆఫీసర్లు ఇళ్లు ఇస్తారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.ఈ నేపథ్యంలోనే ‘డబుల్’ ఇళ్ల కేటాయింపునకు ఎలాంటి పైరవీలు కూడా ఉండబోవని స్పష్టం చేశారు.అయితే, మంత్రి కేటీఆర్ మాత్రం ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు భిన్నంగా మాట్లాడారు.ప్రమాదాల్లో మరణించిన టీఆర్ఎస్ కార్యకర్తలకు టీఆర్ఎస్ పార్టీ అండగా ఉండటంతో పాటు ఇళ్లు లేని పార్టీ కార్యకర్తాల కుటుంబీకులకు ‘డబుల్ బెడ్రూం ఇళ్లు’ కేటాయిస్తామని చెప్పారు కేటీఆర్.
ఈ మేరకు ‘డబుల్’ ఇళ్లు ఇప్పించే బాధ్యత టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రెటరీలపై ఉంటుందని చెప్పకనే చెప్పారు మంత్రి కేటీఆర్.ఈ నేపథ్యంలో సామాన్య ప్రజానీకం నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే అప్లై చేసుకున్న అర్హులకు ‘డబుల్’ ఇళ్లు రాలేదు.ఈ క్రమంలో అసలు దరఖాస్తే చేసుకోని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇళ్లు కేటాయించడం ద్వారా తమకు అన్యాయం జరిగే అవకాశముంటుందని వాపోతున్నారు.
ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి తనయుడు ప్రకటనలు వేర్వేరుగా ఉండటాన్ని బట్టి చేస్తే నేతలకే ఇళ్ల పంపిణీ విషయమై క్లారిటీ లేదేమో అనిపిస్తుందని ప్రజలు అంటున్నారు.తమకు న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని అంటున్నారు.
తాము దరఖాస్తు చేసుకున్నా ఇళ్లు మంజూరు కాని సందర్భాల్లో, పార్టీ కార్యకర్తలకు ఇళ్లు ఇచ్చేందుకు సర్కారు రెడీ కావడాన్ని బట్టి చూస్తే అర్హులైన వారికి అన్యాయం జరుగుతుందని చెప్తున్నారు.