ఏపీలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమం మాదిరిగానే ఇప్పుడు తెలంగాణలో నూ ఆ తరహా కార్యక్రమం నిర్వహించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ సిద్ధమవుతున్నారు.తమకు ప్రధాన ప్రత్యర్ధిగా మారిన బీజేపీని అధికారంలోకి రాకుండా చేయడమే లక్ష్యంగా అనేక రాజకీయ వ్యూహాలను రూపొందిస్తున్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ బిజెపి విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదని, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే చాన్స్ లేకుండా చేయాలని వ్యూహంలో కెసిఆర్ ఉన్నారు .అందుకే తెలంగాణ విషయంలో కేంద్రం ఎటువంటి నిర్లక్ష్య వైఖరిని అవలంభిస్తోందనే విషయాన్ని హైలెట్ చేసి ఇరుకున పెట్టాలని , అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి వంటి వాటిని ప్రజలకు వివరించే విధంగా టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు అందరికీ మౌఖిక ఆదేశాలు వెళ్లాయి. ముఖ్యంగా వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని పార్టీ వర్గాలకు సూచనలు వెళ్ళాయి.ప్రజల్లోకి వెళ్లేందుకు పట్టణ ప్రగతి , పల్లె ప్రగతి వేదిక గా చేసుకుంటోంది.
ఈ మేరకు ఈరోజు నుంచి 17వ తేదీ వరకు నిర్వహించనున్న ఐదో విడత పల్లె ప్రగతి పట్టణ ప్రగతి లో గడపగడపకు ప్రజా ప్రతినిధులు వెళ్లే విధంగా షెడ్యూల్ ను రూపొందించారు.తెలంగాణకు రావాల్సిన పెండింగ్ బిల్లులు, ఐటీఐఆర్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఆదిలాబాద్ సీసీఐ, మెడికల్ కళాశాలలు, నవోదయ పాఠశాలలు తదితర వాటి విషయాల్లో కేంద్రం తెలంగాణపై వివక్ష చూపిస్తోందని గడపగడపకు ప్రజా ప్రతినిధులు వెళ్లిన సందర్భంగా ప్రజలకు వివరించాలని ఆదేశాలు జారీ చేశారు.
అంతేకాదు కేంద్రం అవలంభిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ప్రజల మధ్య ఎండగట్టే విధంగా ప్లాన్ చేస్తున్నారు.

కొత్త సాప్ట్ వేర్ పేరుతో ఉపాధి హామీ నిధులు పెండింగ్, అభివృద్ధిపై ప్రతిపక్షాలు చేసే అనవసర విమర్శలపై ప్రజల మధ్యనే కేంద్రం పై విమర్శలు చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు.కేంద్రం విడుదల చేయాల్సిన 1400 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ప్రజల మధ్యనే కేంద్రాన్ని డిమాండ్ చేయాలని కేటీఆర్ ఆదేశాలు ఇచ్చారు.తెలంగాణ ప్రభుత్వం పై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలను ప్రజల మధ్య తిప్పికొట్టాలని సూచించారు.
ఏ విషయంలోనూ బిజెపి పై చేయి సాధించకుండా అన్ని వ్యూహాలను పక్కాగా అమలు చేసేందుకు టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు.







