ఆ పరమశివునికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం మొదలవడంతో శివాలయాలలో కార్తీక శోభ ఉట్టిపడుతోంది.భక్తులతో శివాలయాలు కిటకిటలాడుతున్నాయి కార్తీకమాసం ఉదయం నిద్ర లేవడం చన్నీటి స్నానాలు ఆచరించి, నిత్యం ఆ పరమశివుని పూజించడం, రోజుకు ఒక పూట మాత్రమే భోజనం చేయడం, కార్తీక వనభోజనాలు వంటి ఎన్నో సంప్రదాయాలతో కార్తీక మాసాన్ని జరుపుకుంటారు.
ఈ కార్తీకమాసంలో ఉపవాసం, కార్తీకదీపం, కార్తీక స్నానం ఈ మూడు ఎంతో ముఖ్యమైనవి.
*కార్తీక స్నానం:
కార్తీక స్నానం అనగా, కార్తీక మాసమంతా తెల్లవారు జామున కృత్తికా నక్షత్రం అస్తమించకముందే స్నానాలు చేయడం, నీరు పారుతున్న కాలువలు గాని, నదులలో కానీ స్నానం చేసిన స్నానాలనే కార్తీక స్నానం అంటారు.కార్తీక స్నానం అనంతరం ఆ శివుని లేదా విష్ణుమూర్తిని భక్తి భావంతో పూజించడం వల్ల సర్వపాపాలు తొలగిపోయి, సకల సంతోషాలను కలిగి ఉంటారు.
*ఉపవాసం:
కార్తీక మాసంలో ఉపవాస దీక్షలతో ఆ శివకేశవులను పూజించటం వల్ల పుణ్య ఫలం దక్కుతుంది.అయితే ఈ ఉపవాస దీక్ష లో పాల్గొనేవారు ఉదయం నుంచి ఎటువంటి పదార్థాలు సేవించకుండా ఉండాలి.అవసరమైతే తప్ప పాలు లేదా పండ్ల వంటి పదార్థాలను తీసుకోవాలి.సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత దీపారాధన పూర్తిచేసుకుని భోజనం చేయాలి.
*కార్తీక దీపారాధన:
కార్తీక మాసంలో దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.ప్రతి ఇంట్లో లేదా శివాలయాలలో సాయంత్ర సమయాలలో దీపాలను వెలిగించడం ద్వారా దైవానుగ్రహం కలుగుతుంది.కార్తీక మాసంలో ఏ దేవాలయంలో నైనా దీపారాధన చేయటం వల్ల సర్వపాపాలు తొలగిపోయి పుణ్యఫలం కలుగుతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.
అంతేకాకుండా కార్తీక పౌర్ణమి రోజు దీపాలు నదిలో వదిలి చంద్ర దర్శనం తర్వాత మహిళలు ఒకరికొకరు తాంబూలాలు ఇచ్చి పుచ్చుకోవడం ద్వారా వారు దీర్ఘ సుమంగళి గా వర్ధిల్లుతారని ప్రతితీ.ఈ దీపాలను ప్రతిరోజు సాయంత్రం మన ఇంటి ముందు ముగ్గులో, తులసి కోట దగ్గర వెలిగించాలి.
*ధాత్రి పూజ:
ధాత్రి అంటే ఉసిరిక, ఈ ఉసిరిక లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది.కార్తీక సోమవారం నాడు ఈ ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం ద్వారా ఆ అమ్మవారి కటాక్షం కలుగుతుందని భావిస్తారు.
అంతేకాకుండా ఈ వృక్ష మొదళ్లో ధాత్రి దేవి, దామోదర స్వామిని పూజిస్తారు.కుటుంబ సభ్యులతో కలసి కార్తీకమాసంలో ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం వల్ల ఎంతో అదృష్టమని భావిస్తారు.