అది ఝార్ఖండ్ రాష్ట్రం.అందులో ఓ ప్రభుత్వ పాఠశాల.అన్ని పాఠశాలల్లాగే అందులోనూ కనీస వసతులు లేవు.ఏమీ పట్టించుకోని టీచర్లూ ఇక్కడి లాగే అక్కడ కూడా ఉన్నారు.అక్కడి అధికారుల్లోనూ నిర్లక్ష్యం ఏమాత్రం తక్కువగా కాకుండా మెండుగానే ఉంది.ఇంకేం.
స్కూల్ ఎలాంటి దుస్థితిలో ఉండాలో అచ్చంగా(కొద్దిగా ఎక్కువే) అలాగే ఉంది.తన స్కూల్ పరిస్థితి వివరిస్తూ ఓ బుడ్డోడి అచ్చంగా జర్నలిస్టుల్లాగే (న్యూస్ ఛానల్ రిపోర్టర్ల ప్రభావం) రిపోర్టింగ్ చేశాడు.
తన బడిలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చక్కగా వివరించాడు.ఇప్పుడు ఆ వీడియో కాస్త దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది.
ఎవరికి చేరాలో వారికి చేరడంతో.అదే బడిలో పనిచేస్తున్న ఇద్దరు టీచర్లు పైఅధికారులు సస్పెండ్ చేసి మమా అనిపించారు.
అసలేం జరిగిందంటే.
ఝార్ఖండ్ రాష్ట్రం, గొడ్డా జిల్లా, మహ్గామా బ్లాక్ లో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అది.కొన్నేళ్లుగా అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది.విద్యార్థులూ రావడం లేదు.
చుట్టు పక్కల నుండి బుడ్డోళ్లు వచ్చి ఆడుకుంటూ ఉంటారు.ఆటలో భాగంగా ఓ పిల్లాడు రిపోర్టర్ గా అవతారం ఎత్తాడు.
కర్రకు ప్లాస్టిక్ బాటిల్ తగిలించి మైక్ తరహాలో తయారు చేశాడు.దానినే మైక్ అనుకుని సమస్యలు వివరిస్తూ పోయాడు.
తాగడానికి నీళ్లు లేవని, పిచ్చి మొక్కలు పెరిగిపోయాయని, మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయని, తరగతి గదిలో పశువుల మేత వేస్తున్నారని, టీచర్లు రాక పిల్లలు ఆడుకుంటున్నారని ఇలా చాలా చెప్పాడు.ఆ వీడియోకాస్త దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది.
దీంతో స్పందించిన ఉన్నతాధికారులు ఇద్దరు టీచర్లు సస్పెండ్ చేశారు.