కేంద్ర అధికార పార్టీగా ఉన్న బిజెపి రెండు తెలుగు రాష్ట్రాల్లో తమ పార్టీ అధికారంలో లేకపోయినా, ఏపీ, తెలంగాణలలో అధికారంలో ఉన్న వైసిపి, బీఆర్ఎస్ లను తమ గుప్పెట్లో పెట్టుకునే వ్యూహానికి తెర తీసింది.వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్( Y.
S.Jagan ) అన్ని విషయాలలోనూ కేంద్రంతో సఙ్ఖతగానే మెలుగుతున్నారు.ఏపీ బీజేపీ నేతలు పెద్ద ఎత్తున వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నా.కేవలం రాష్ట్ర బీజేపీ నాయకుల వరకు ఆ విమర్శలను తిప్పికొడుతూ ప్రతి విమర్శలు చేస్తున్నారు.
కానీ కేంద్రంలో ఉన్న బిజెపి పెద్దలను విమర్శించేందుకు ఏమాత్రం సాహసించడం లేదు.అంతే కాదు కేంద్రం ప్రవేశపెట్టి ప్రతి బిల్లుకు వైసిపి ఎంపీలు మద్దతు పలుకుతూనే వస్తున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ విషయానికి వస్తే మొదట్లో బిజెపి కేంద్ర పెద్దలతో సఙ్ఖతగానే మెలుగుతూ ఆ తరువాత తరువాత కేంద్ర బీజేపీ( BJP ) పెద్దలపైన విమర్శలు చేస్తూ.బిజెపికి ప్రధాన ప్రత్యర్థులుగా మారారు.
తెలంగాణలో బిజెపి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుండడం, కెసిఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టడం, తదితర కారణాలతో బిజెపిని ఆ స్థాయిలో విమర్శలతో విరుచుకుపడుతున్నారు .
అయితే తమకు రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారం లేకపోయినా, రెండు రాష్ట్ర ప్రభుత్వాలను తమ గుప్పెట్లో పెట్టుకునేందుకు కేంద్ర బిజెపి పెద్దలు ప్రతి దశలోనూ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.ఈ క్రమంలోని సిబిఐ, ఈడి వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను రంగంలోకి దించి రెండు రాష్ట్రాల్లోని అధికార పార్టీలను ఇరుకుని పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో కెసిఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును ఈడి అధికారులు చేర్చారు.
దీనికి సంబందించిన ప్రాథమిక సాక్షాలన్నీ సిద్ధం చేసుకున్నారు.ఏ క్షణంలోనైనా కవితను అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది.
అలాగే ఏపీ అధికార పార్టీ వైసీపీకి చెందిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డిలతో పాటు, ఆయన కుమారుడు రాఘవ పేరును ఈ కేసులో చేర్చారు.ఇప్పటికే మాగుంట రాఘవను అరెస్ట్ చేయడం, ఆయనను రిమాండ్ కు తరలించడం వంటివి జరిగాయి.అలాగే మాజీ మంత్రి జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులోనూ సిబిఐ అధికారులు దూకుడు ప్రదర్శిస్తున్నారు.ఈ కేసులో జగన్ సోదరుడు వైస్ అవినాష్ రెడ్డి( Ys avinash reddy )ని విచారణకు పిలిచారు.
ఆయనను త్వరలో అరెస్ట్ చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.ఇప్పటికే ఈ వ్యవహారంపై ఆందోళనలో ఉన్న జగన్ ప్రధాని నరేంద్ర మోదిని కలిసి ఈ కేసుల వ్యవహారంపై చర్చించినట్టు గా ప్రచారం జరుగుతుంది.
ప్రస్తుతం ఏపీ స్కిల్ డెవలెప్ మెంట్ స్కాం లో టిడిపి కీలక నేతలతో పాటు, ఆ పార్టీ అధినేత చంద్రబాబు హస్తం ఉందని వైసీపీ ఆరోపించడంతో పాటు, దీనిపైన సిఐడి దర్యాప్తు చేయిస్తుంది.అయితే ఇదే వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడి , ఐటి అధికారులను రంగంలోకి దించే ప్లాన్ లో కేంద్రం ఉంది. ఈ విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలతో పాటు, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలను టార్గెట్ చేసుకుని ముందుకు వెళ్లే ఆలోచనతో కేంద్ర అధికార పార్టీ ఉండడంతో, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు అధికారంలో ఉన్నా, ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నా. తమ చెప్పు చేతుల్లోనే ఉండాలి అనే విధంగా కేంద్ర అధికార పార్టీ బిజేపి పావులు కదుపుతోంది.