రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని తాజాగా టీడీపీ, జనసేన, వామపక్షాలు సహా అన్ని ప్రతిపక్ష పార్టీలూ వ్యతిరేకిస్తుండగా వైసీపీ మాత్రం పొగుడుతుండడం గమనార్హం.కార్పొరేషన్, మునిసిపాలిటీ ఎన్నికలు ఎక్కడ ఆగిందో అక్కడ నుంచి మొదలు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ కోర్టుకు కూడా వెళ్లాయి.
అప్పట్లో అవినీతి, అక్రమాల కారణంగా మా వాళ్లు నామినేషన్ వేయలేక పోయారు కనుక మళ్లీ కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని ఈ పార్టీలు కోరుతున్నాయి.ఈ క్రమంలో 16 పిటిషన్లు కూడా దాఖలయ్యాయి.
అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ దాఖలైన ఈ 16 మధ్యంతర పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది.
అయితే ఇక్కడే చిత్రమైన రాజకీయం వెలుగు చూసింది నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో ఏపీ అధికార పార్టీ వైసీపీ నేతల వైఖరిపై నెటిజన్లు మండి పడుతున్నారు.
పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ ఇచ్చినప్పుడు ఆయనను తిట్టిన వైసీపీ ఇప్పుడు మాత్రం కొనియాడుతోంది.నిమ్మగడ్డను ఇప్పుడు వైసీపీ నాయకులు సపోర్టు చేస్తున్నారు.ఈ పరిణామం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. వైసీపీ వింత రాజకీయం.
అంటూ టీడీపీ నేతలు కామెంట్లు కుమ్మరిస్తున్నారు.

స్థానిక ఎన్నికల్లో తొలి ఘట్టంలో వైసీపీ నిమ్మగడ్డ మధ్య వార్ వన్ సైడ్ అన్నట్టుగా సాగింది.ఇక, రెండో ఘట్టమైన మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికల విషయానికి వస్తే పూర్తిగా వైసీపీ యూటర్న్ తీసుకుంది.కాగా, 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపల్, నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గతంలో షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే.
షెడ్యూల్ ప్రకారం మార్చి 10న మున్సిపల్ ఎన్నికలు 14న ఓట్ల లెక్కింపు జరగనుంది.మార్చి 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణ గడువు.అనంతరం అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు.
మార్చి 8వ తేదీ సాయంత్రంతో అభ్యర్థుల ప్రచారం ముగియనుంది.
అవసరమైతే మార్చి 13న రీ పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది.ఇక, తాజాగా కోర్టు ఇచ్చిన తీర్పును వైసీపీ నేతలు హర్షించారు.
అదేసమయంలో నిమ్మగడ్డకు సానుకూలంగా కామెంట్లు చేస్తున్నారు.దీనిని ప్రధాన పార్టీలు సహా నెటిజన్లు కూడా విమర్శిస్తుండడం గమనార్హం.