తెలంగాణ బిజెపిలో( Telangana BJP ) రోజురోజుకు గ్రూపు రాజకీయాలు పెరిగిపోతున్నాయి.ఎన్నికలకు కొద్ది నెలలు మాత్రమే సమయం ఉన్నా, పార్టీ నేతలు అంతా సమన్వయంతో ముందుకు వెళుతూ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాల్సి ఉన్నా, తమకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదనే అసంతృప్తితో వ్యవహరిస్తున్నారు.
ముఖ్యంగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్( Telangana BJP president Bandi Sanjay ) తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కొంతమంది నేతలు అధిష్టానం పెద్దలకు ఫిర్యాదు చేసిన పెద్దగా మార్పు కనిపించలేదని, మరికొద్ది రోజుల పాటు వేచి చూసి అప్పుడు తగిన నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారట.ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే గొజ్జల రామకృష్ణారెడ్డి( Gojjala Ramakrishna Reddy ) నేతృత్వంలో పార్టీ నేతలు చింతా సాంబమూర్తి , సుగుణాకర్ రావు, వెంకటరమణి, మల్లారెడ్డి , పాపారావు తదితరులు రెండు రోజుల క్రితమే ఎమ్మెల్యే క్వార్టర్ లో భేటీ అయినట్లు సమాచారం.
ఈ సందర్భంగా బండి సంజయ్ తీరుపై ప్రధానంగా చర్చిస్తున్నారట.బండి సంజయ్ ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారని, పార్టీ నేతలు అందరిని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లడం లేదని, పాత కొత్త నేతల మధ్య సమన్వయం కుదర్చకపోగా, పెత్తనం చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం చేశారు.సంజయ్ సొంతంగా గ్రాఫ్ పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారని , పార్టీలో సీనియర్ నాయకులను పట్టించుకోవడంలేదని, వారికి తగిన గౌరవం కల్పించడం లేదని, కార్యక్రమాల నిర్వహణలోనూ పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదని, జిల్లాల పర్యటనకు వచ్చినప్పుడు తగిన విధంగా వ్యవహరించడం లేదని బిజెపి అధిష్టానం పెద్దలకు ఫిర్యాదు చేశారట.ఈనెల చివరి వరకు వేచి చూసి అప్పుడు తగిన నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనతో అసంతృప్తి నేతలు ఉన్నారట.
వీరి వ్యవహారం ఇలా ఉంటే తెలంగాణ బిజెపిలో ఎప్పటి నుంచో గ్రూపు రాజకీయాలు పెరిగిపోయాయి.కొత్త , పాత నేతల మధ్య ఆధిపత్య పోరు కనిపిస్తోంది.
ఈ విషయాలపై ఎప్పటికప్పుడు అధిష్టానం పెద్దలు దృష్టి సారించి నాయకుల మధ్య సమన్వయం కుదిర్చే విధంగా వ్యవహారాలు చేస్తున్నా, పరిస్థితుల్లో మార్పు అయితే రావడం లేదు.మరోవైపు చూస్తే అధికార పార్టీ బీఆర్ఎస్ దూకుడుగా ముందుకు వెళుతుంది.మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని దక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది.ఈ సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను హైలెట్ చేసి , నాయకులంతా సమన్వయంతో ముందుకు వెళ్లాల్సి ఉన్నా, కీలకమైన ఎన్నికల సమయంలో ఈ విధంగా గ్రూపు రాజకీయాలు, అసంతృప్తి వ్యవహారాలు పెరిగిపోతుండడం తెలంగాణ బిజెపికి ఇబ్బందికరంగా మారింది.
ఇప్పటికే బండి సంజయ్, ఈటెల రాజేందర్, ధర్మపురి సంజయ్, కిషన్ రెడ్డి వర్గాలుగా తెలంగాణ బిజెపి చీలిపోయిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్న నేపథ్యంలో సంజయ్ తీరు పై వస్తున్న ఆరోపణల పై బిజెపి అధిష్టానం పెద్దలు ఏ విధంగా ఈ వ్యవహారాలపై దృష్టి సారిస్తారో?
.