మొన్నటివరకు ఏపీలో అప్పుడే ఎన్నికలన్నట్లు రాజకీయ హడావుడి చేశాయి పలు పార్టీలు.ఎందుకంటే దాదాపుగా ఏడాది క్రితం నుంచి ప్రచారం సాగుతోంది జగన్ ప్రభుత్వం ముందస్తుకు వెళ్తుందని.
వాస్తవానికి జగన్ రెండేళ్ల పాలన తర్వాత నుంచే ముందస్తు ప్రచారం మొదలైంది.జగన్ ఏ క్షణమైనా ఎన్నికలకు వెళ్తారని టీడీపీ సహా ఇతర పార్టీలు పావులు కదిపాయి.
ఇక ఈ ఏడాది మే 30 నాటికి మూడేళ్ల పాలన పూర్తి అయింది.దాంతో ముందస్తు ఎన్నికలు అన్న వాదన బలంగా వినిపించింది.
దీంతో చంద్రబాబు జోరు పెంచేశారు.అన్ని జిల్లాలనూ తిరుగుతున్నారు.
మరోవైపు జనసేనాని పవన్ కల్యాణ్ సైతం కూడా ఏడాది ముందే తన షెడ్యూల్ మార్చేసుకుని బరిలోకి దిగిపోతున్నారు.ఆయన అక్టోబర్ 5 దసరా నుంచి బస్సు యాత్రకు ప్లాన్ చేసుకున్నారు.
అయితే జనసేన లెక్కల ప్రకారం 2023 ఏప్రిల్- మే నెలల మధ్యలో ముందస్తు ఎన్నికలు వస్తాయిని.ఆ పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్ కూడా అన్నారు.
మరోపక్క ఇక చినబాబు లోకేష్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడానికి రెడీ అవుతున్నారు.ఇంకో వైపు పొత్తుల కోసం కూడా ప్రయత్నాలు ముమ్మరం అవుతున్నాయి.వీటికి ఒక రకంగా వైసీపీ కారణం అని చెప్పాలి.ఆ పార్టీ కీలక నేత.ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి అయితే ఎన్నికలు ఎపుడైనా రావచ్చు అన్నట్లుగా ఆ మధ్యన మీడియాతో మాట్లాడి కొంత కంగారు పెట్టిన విషయం తెలిసిందే.ఇక జగన్ కూడా ఇది నిజం అనేలా పార్టీ నేతలతో వరస సమావేశాలు జరపడం అలాగే వర్క్ షాప్స్ పేరిట ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకోవడం ఇక గడప గడపకూ మన ప్రభుత్వం అంటూ ఎమ్మెల్యేలను పంపించడం వంటి వాటితో ఎన్నికల వాతావరణాన్ని క్రియేట్ చేశారని అంటున్నారు.అయితే డిసెంబర్ నాటికి మెజారిటీ నియోజకవర్గాలలో అభ్యర్థుల జాబితాను రెడీ చేస్తారు అని కూడా వైసీపీలో వినిపిస్తున్న మాట.
వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి తర్వాతే…

అయితే ఇదిలా ఉంటే జగన్ ఉమ్మడి ప్రకాశం జిల్లా చీమకుర్తిలో జరిగిన సభలో మాట్లాడుతూ ఉమ్మడి ప్రకాశం జిల్లాకు కీలకం అయిన వెలుగొండ ప్రాజెక్ట్ రెండవ దశను వచ్చే ఏడాది సెప్టెంబర్ లో పూర్తి చేస్తామని ప్రకటించారు.అది పూర్తి చేసి జాతికి అంకితం చేసి అపుడే ఎన్నికలకు వెళ్తామని జగన్ స్టేట్మెంట్ ఇచ్చారు.అంటే ఇప్పటికి సరిగ్గా మరో పదమూడు నెలల తరువాత వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి అవుతుంది అన్న మాట.సెప్టెంబర్ అని చెబుతున్నా అది ఆ ఏడాది చివరికి పూర్తి అయినా కావచ్చు.మరి అప్పటికి 2024 ముంగిట అంతా ఉంటారు.
మరి 2024లోనే సార్వత్రిక ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయి.దీంతో ముందస్తు ఉండకపోవచ్చనే అంటున్నారు.
అభివృద్ది కూడా జరగాలని…

దానికి కారణాలు ఏంటి అంటే ఏపీలో సంక్షేమం తప్ప అభివృద్ధి లేదు.దాంతో ఎంతో కొంత ఏదో చేశామని చెప్పుకోకుండా ఎన్నికలకు వెళ్తే ఇబ్బంది అవుతుంది అని భావించే ముందస్తుకు నో చెప్పేశారు అని అంటున్నారు.ఇక వైసీపీ గెలుస్తుంది అనుకుంటే ఇపుడు వెళ్లినా షెడ్యూల్ టైమ్ కి వెళ్లినా ఒక్కలాగే రిజల్ట్ వస్తుంది.అలా కాకుండా వ్యతిరేకత వస్తుంది అనుకుంటే మాత్రం ముందస్తుకు వెళ్లకూడదనే నిర్ణయించుకుంటారు.
అందుకే వైసీపీ ఎంతో కొంత చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్తే బాగుంటుందని భావిస్తున్నట్లు చెబుతున్నారు.అందుకే ఈ ఇరవై నెలలలో అభివృద్దిపై దృష్టి పెట్టనుంది.సో ఏపీలో ముందస్తు లేనట్లే అంటున్నారు.తొందరపడి విపక్షాలు జోరు పెంచినా నష్టమేమిలేదని అంటున్నారు.
అయితే ఇప్పటి నుంచే హడావుడి చేస్తే ఎన్నికల సమయం నాటికి ఆ ఊపు లేకపోతే నష్టం తప్పదని అంటున్నారు.