జగిత్యాలలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు.ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దన్న ఆయన ప్రజలు ఆలోచించి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని తెలిపారు.
తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వనని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారన్న కేసీఆర్ అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా మాట్లాడలేదని మండిపడ్డారు.ఇప్పుడేమో ఇందిరమ్మ రాజ్యం తెస్తామని కాంగ్రెస్ అంటోందంటూ విమర్శించారు.
కానీ ఇందిరమ్మ రాజ్యం అంటే ఎన్ కౌంటర్లేనని, ఇందిరమ్మ రాజ్యంలోనే జగిత్యాలను కల్లోలిత ప్రాంతంగా ప్రకటించారని తెలిపారు.ఇందిరమ్మ రాజ్యంలోనే ఎమర్జెన్సీ వచ్చిందన్నారు.
కాంగ్రెస్ హయాంలో కనీసం తాగునీరు కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు.కానీ బీఆర్ఎస్ వచ్చాక రూ.200 పెన్షన్ ను రూ.2 వేలు చేశామని తెలిపారు.ఈసారి గెలిస్తే పెన్షన్లను రూ.5 వేలకు పెంచుతామన్నారు.రైతుబంధు వేస్ట్ అని కాంగ్రెస్ నేతలు అంటున్నారన్న కేసీఆర్ రైతుబంధు ఉండాలా? వద్దా? ప్రజలే ఆలోచించుకోవాలన్నారు.ఈసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రైతుబంధును రూ.16 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు.24 గంటల కరెంట్ కావాలంటే బీఆర్ఎస్ కు ఓటు వేయాలని తెలిపారు.