బిఆర్ఎస్ అధినేత , తెలంగాణ సీఎం కేసీఆర్ పూర్తిగా ఎన్నికల మూడ్ లోకి వెళ్ళిపోయారు.ప్రస్తుతం కేంద్ర అధికార పార్టీ బిజెపి తమ పార్టీ నాయకులను టార్గెట్ చేసుకుని పాల్పడుతూ ఉండడంతో దానిని ఏ విధంగా ఎదుర్కోవాలి అనే విషయాలపైనే పూర్తిగా ఫోకస్ చేశారు.
దీంతో పాటు, రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు తదితర అంశాలపై ఒక క్లారిటీకి వచ్చారు.ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల్లో 99% సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇస్తామని ప్రకటించారు .ఈ సందర్భంగా కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుపైన కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలకు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు దళిత బంధు పథకం కింద డబ్బులు తీసుకుంటున్నట్లు తనకు స్పష్టమైన సమాచారం ఉందని, ఇది ఇలాగే కొనసాగితే కఠిన చర్యలు తీసుకుంటానంటూ కేసిఆర్ వార్నింగ్ ఇచ్చారు.
ప్రతి నియోజకవర్గంలో దళిత బంధు, రైతుబంధు, రైతు బీమా, పెన్షన్లు వంటి వాటిని అందుకునే వారందరినీ కలిసే విధంగా ఎమ్మెల్యేలు కార్యక్రమాలు రూపొందించుకోవాలని సూచించారు.ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదేనని అన్నారు.అలాగే ఎవరికి వారు తమ తమ నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని, నియోజకవర్గంలోని ముఖ్యమైన ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాటు చేసుకోవాలని, మిగతా అన్ని విషయాలను పక్కనపెట్టి పూర్తిగా ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు.
టిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 27న నిర్వహించే ప్లీనరీ ఉండదని, బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు జరుపుకుందామని ,ఏప్రిల్ లో వరంగల్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు కేసిఆర్ ప్రకటించారు.ఎమ్మెల్యేలు ఎవరు ఎటువంటి అవినీతికి పాల్పడవద్దని, ప్రభుత్వ పథకాల పేరుతో లంచాలు తీసుకుంటే తాను ఏమాత్రం ఉపేక్షించనని, అటువంటి వారికి ఈసారి టికెట్లు ఇచ్చేదే లేదంటూ కేసీఆర్ తేల్చి చెప్పారు.99% సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నట్లు కేసిఆర్ ప్రకటించారు.తమ ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న బిజెపి చేస్తున్న ఆరోపణలు తిప్పి కొట్టాలని, మంత్రులు జిల్లా, నియోజకవర్గ స్థాయిలో మీడియా సమావేశాలు నిర్వహించి ఎప్పటికప్పుడు బిజెపి ఆరోపణలు తిప్పికొట్టాలని కేసీఆర్ సూచించారు.