క్యాన్సర్ మహమ్మారిపై పోరాటం చేస్తున్న హైదరాబాద్కు చెందిన వైద్యుడు డాక్టర్ పీ రఘురామ్ను బ్రిటన్ సర్కార్ ప్రతిష్టాత్మక పురస్కారంతో సత్కరించింది.ఈ మేరకు బుధవారం ‘‘ ఆఫీసర్ ఆఫ్ ది మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ (OBE) అవార్డు’’ను బహూకరించారు.
గడిచిన 100 ఏళ్లలో ఈ అవార్డు అందుకున్న భారతీయ సంతతికి చెందిన అత్యంత పిన్న వయస్కుడైన సర్జన్లలో ఒకరిగా రఘురామ్ నిలిచారు.క్వీన్ ఎలిజబెత్ II తరపున, ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ప్రిన్స్ చార్లెస్, లండన్లోని విండ్సర్ కాజిల్లో డాక్టర్ రఘురామ్కి బహుమతిని అందజేశారు.
ఓబీఈ అవార్డు అనేది ‘‘ఆర్డర్ ఆఫ్ ది బ్రిటీష్ ఎంపైర్ అవార్డు’’లలో రెండవ అత్యున్నత పురస్కారం.
డాక్టర్ రఘురామ్.
హైదరాబాద్ కిమ్స్-ఉషా లక్ష్మీ సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్ డైరెక్టర్గానూ… ఉషాలక్ష్మీ బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపక సీఈవోగాను వ్యవహరిస్తున్నారు.భారత్, యూకేలలో రొమ్ము క్యాన్సర్ సంరక్షణ, శస్త్రచికిత్స విద్యను మెరుగుపరచడంలో అత్యుత్తమ సేవలకు గాను ఓబీఈ అవార్డును అందుకున్నారు.
ఈ సందర్భంగా తనను ఇంతటి ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేసినందుకు గాను క్వీన్ ఎలిజబెత్కు రఘురామ్ కృతజ్ఞతలు తెలియజేశారు.గడిచిన 15 ఏళ్లుగా తాను భారత్లో అత్యుత్తమ బ్రిటీష్ విధానాలను అనుసరించేందుకు ప్రయత్నించానని రఘురామ్ అన్నారు.
యూకే- ఇండియాల మధ్య ‘జీనవ వారథి’గా వున్నందుకు గర్వంగా భావిస్తున్నానని చెప్పారు.తనకు దక్కిన ఈ గౌరవాన్ని కుటుంబ సభ్యులకు, రోగులకు, కిమ్స్ హాస్పిటల్లోని సహోద్యోగులకు, ప్రపంచవ్యాప్తంగా వున్న భారత సంతతి సర్జన్లకు అంకితమిచ్చారు.

డాక్టర్ రఘురామ్ 2015లో పద్మశ్రీ , 2016లో డాక్టర్ బీసీ రాయ్ జాతీయ అవార్డులను అందుకున్నారు.అంతేకాదు.ఈ పురస్కారాలను అందుకున్న అత్యంత పిన్న వయస్కులలో ఒకరిగా ఆయన నిలిచారు.ఇకపోతే.బాలీవుడ్ నటుడు ఓంపురి, ఫుట్బాల్ క్రీడాకారుడు డేవిడ్ బెక్హమ్, ఆయన భార్య విక్టోరియా బెక్హమ్, క్రికెటర్ బెన్స్టోక్స్, రచయిత జేకే రౌలింగ్, నటి కైరా నైట్లీలు ‘ఓబీఈ’ అవార్డును పొందారు.