కేంద్రం దేశాభివృద్ధిలో భాగంగా మరో మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.ఇందులో భాగంగా దేశంలోని నేషనల్ హైవేలను స్మార్ట్ హైవేలుగా మార్చాలని కేంద్ర రవాణా మరియు జాతీయ రహదారుల శాఖ నిర్ణయం తీసుకుంది.
అయితే ఇది ఇప్పట్లో పూర్తవ్వక పోవచ్చు, 2050 నాటికి విస్తృతం కానున్న అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్ట్ను రూపొందించారు.అందుకని ఇది పూర్తవడానికి కాస్త సమయం పడుతుంది.దానికోసం రూ.6 వేల కోట్లతో జాతీయ రహదారుల వెంబడి OFC (ఆప్టికల్ ఫైబర్ కేబుల్) లైన్లను ఏర్పాటు చేయనున్నారు.

వీటిని మొత్తంగా 25వేల కి.మీ మేర ఏర్పాటు చేయనున్నారు.ఇందుకోసం జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ, కేంద్ర టెలికాం రెగ్యులేటరీ అథారిటీ(ట్రాయ్)తో కలిసి ఓ ప్రణాళిక రూపొందించింది.ముందుగా పైలట్ ప్రాజెక్ట్ కింద రూ.500 కోట్ల అంచనా వ్యయంతో హైదరాబాద్-బెంగళూరు, ముంబై-ఢిల్లీ జాతీయ రహదారులలో OFC లైన్ల పనులు చేపట్టనున్నారు.ఈ క్రమంలో మొత్తం 2 వేల కి.మీ మేర OFC లైన్లను వేయనున్నారు.మూడేళ్లలో ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేయాలనే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది.

అది పూర్తైన తరువాత చెన్నై-విజయవాడ, ముంబై – అహ్మదాబాద్ నేషనల్ హైవేలో OFC లైన్ల పనులు ప్రారంబించనున్నారు.జాతీయ రహదారుల వెంబడి నిరంతరాయంగా 5జీ సేవలను అందించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.ప్రయాణికులకు సౌలభ్యంగా ఉండడంతో పాటు దేశవ్యాప్తంగా లాజిస్టిక్ రంగాన్ని విస్తృతం చేసేందుకు ఈ ప్రాజెక్ట్ దోహదపడుతుంది.త్వరలోనే దేశవ్యాప్తంగా ఉన్న టోల్గేట్లను కూడా ఎత్తివేసి.5జీ నెట్వర్క్ సాయంతో ఫాస్ట్ ట్యాగ్ ద్వారా టోల్ ఫీజు వసూల్ చేయనున్నారు.అలాగే జాతీయ రహదారులపై వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు ఏర్పాటు చేసే స్పీడ్ రాడార్లు కూడా ఓఎఫ్సీ లైన్ల ద్వారానే పనిచేస్తాయి.







