ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీని వీడేందుకు సిద్ధం అవుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.దీనికి బలం చేకూరుస్తూ ఆయన అజ్ఞాతంలోకి వెళ్లడం, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
బుధవారం ఉదయం నుంచే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం, ఆయన పార్టీ మారబోతున్నారు అనే పుకార్లు కూడా ఎక్కువ అవ్వడంతో స్వయంగా చంద్రబాబు రంగంలోకి దిగి ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించినా ఉపయోగం లేకపోయిందట.తనకు భీమిలి అసెంబ్లీ టికెట్ కు బదులుగా విశాఖపట్నం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాల్సిందేనంటూ అధినేత చంద్రబాబు ఒత్తిడి పెంచుతున్న నేపథ్యంలో ఆ ఒత్తిడి భరించలేక ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్టు ఆయన ముఖ్య అనుచరులు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
చంద్రబాబు తనయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ భీమిలీ నుంచి పోటీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారంటూ వార్తలు వచ్చినా లోకేష్ గానీ, టీడీపీ పార్టీ నాయకత్వం గానీ దీనిపై స్పందించలేదు.కొద్దిరోజులకు సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ టీడీపీలో చేరబోతున్నారని ఆయనకు భీమిలీ టికెట్ ఇస్తారంటూ లీకులు కూడా వినిపించాయి.
అయితే ఇదంతా భీమిలీ సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు తెలియకుండా జరుగుతుండడంతో ఆయన మనస్థాపానికి గురయ్యాడట.
గంటా శ్రీనివాస రావుకు ఉత్తరాంధ్రలో కీలక నాయకునిగా మంచి గుర్తింపు ఉంది.కానీ పార్టీలు మారడంలో సిద్దహస్తుడిగా పేరుంది.గతంలో టీడీపీలో లోక్ సభ, శాసనసభకు ఎన్నికయ్యారు.
ఆ తరువాత చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని పెట్టిన తరువాత ఆయన తన మిత్రులు అవంతి శ్రీనివాస్, పంచకట్ల రమేష్ బాబు, చింతలపూడి వెంకట్రామయ్య, పరుచూరి భాస్కర్ రావులతో కలిసి ప్రజారాజ్యం లో చేరారు.పీఆర్పీని చిరంజీవి కాంగ్రెస్ లో విలీనం చేసిన తరువాత వాళ్లందరూ అదే పార్టీలో కొనసాగారు.
కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో గంటా శ్రీనివాస రావుకు మంత్రి పదవి లభించింది.రాష్ట్ర విభజన తరువాత గంటా తన సన్నిహితులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు.
ప్రస్తుతం టీడీపీ మీద అసంతృప్తిగా ఉన్న ఆయన వైసీపీ , జనసేన ఈ రెండింటిలో ఏదో ఒక పార్టీని ఎంపిక చేసుకోవచ్చని ఆయనకు అత్యంత సన్నిహితులు కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.
.