భారత ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం నియోజకవర్గానికి రాబోతున్నారు.భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించనున్నారు.
ఈ మేరకు ప్రధాన పర్యటనకు భారీగా ఏర్పాట్లు చేశారు.సభ వేదిక వద్ద దాదాపు 50 వేల మంది కూర్చునే విధంగా ఏర్పాట్లు చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ సభ వేదికపై కూర్చునే అతిధుల జాబితా కూడా అధికారులు సిద్ధం చేశారు.హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ప్రధాని గన్నవరం చేరుకుంటారు.ఉదయం 9.40 నుంచి గన్నవరం ఎయిర్ పోర్ట్ కు సీఎం బయలుదేరుతారు.10.10 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్న ప్రధాని మోదికి ఏపీ సీఎం జగన్ స్వాగతం పలకనున్నారు.10.15 గంటలకు గన్నవరం నుంచి భీమవరం ప్రధాని హెలికాప్టర్ ద్వారా చేరుకోనున్నారు.
10.50 గంటలకు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.మధ్యాహ్నం 12.30 గంటలకు భీమవరం నుంచి ప్రధాని బయలుదేరి గన్నవరం విమానాశ్రయం కు చేరుకుంటారు.మధ్యాహ్నం 1.05 గంటలకు గన్నవరం విమానాశ్రయంలో ప్రధానికి సీఎం జగన్ వీడ్కోలు పలుకుతారు.ఇక అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ తరువాత బహిరంగ సభను ఏర్పాటు చేశారు.ఈ సభలో ప్రధానితో పాటు 11 మంది కి సభ వేదికపై స్థానం కల్పించారు.
ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ గవర్నర్ బిస్వా భూషణ్ హరి చందన్, ఏపీ సీఎం జగన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో పాటు, మరో ఏడుగురు పాల్గొంటారు.అల్లూరి సీతారామరాజు సోదరుడి మనవడు శ్రీరామరాజు, అల్లూరి సైన్యంలో కీలకపాత్ర పోషించిన మల్లుదొర కుమారుడు బోడి దొరలను వేదికపై ప్రధాని సత్కరించనున్నారు.
అల్లూరి రక్తసంబంధీకులు , మన్యం పితూరి సైన్యంలో కీలక పాత్ర వహించిన వ్యక్తుల బంధువులను అల్లూరి ఉత్సవాలకు భీమవరం రప్పించారు .వారితో ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగతంగా భేటీ కాబోతున్నారు.ఈ సందర్భంగా వారిని ప్రధాని సత్కరించనున్నారు.సభ ప్రాంగణం వద్ద ఎటువంటి లోటుపాట్లు లేకుండా అధికారులు పగడ్బందీగా చర్యలు తీసుకున్నారు.సభ ప్రాంగణం లో భారీ వర్షం కురవడం తో ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోయాయి.వాటిని మోటార్లతో తోడించడంతో పాటు, లోతట్టు ప్రాంతాల్లో అప్పటికప్పుడు మట్టి పోసి ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా చేపట్టారు.