మునగ లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మార్కెట్లో వీటికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది.మునగను పంట పొలాల్లో, ఇంటి వద్ద ఖాళీ స్థలాల్లో, పొలాల గట్లపై రైతులు పండిస్తున్నారు.
మునగ సాగులో అత్యంత కీలకం ఎరువుల యాజమాన్యం.ఎటువంటి ఎరువులు ఏ సందర్భాల్లో పంటకు అందించాలో అవగాహన ఉంటే నాణ్యమైన దిగుబడి పొంది మంచి ఆదాయం పొందవచ్చు.
రసాయనిక ఎరువుల ధరలు క్రమేణా పెరుగుతూ పోతుండడంతో రైతులకు పెట్టుబడి భారంగా మారింది.వ్యవసాయ క్షేత్ర నిపుణుల సలహాలతో మునగకు కావలసిన ఎరువులు ఏమిటో అవగాహన కల్పించుకొని తక్కువ మోతాదులో వాడి పెట్టుబడి అదా చేసుకోవాలి.

మునగకు కావలసిన ఎరువులను అతి ముఖ్యమైనదిగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ తో పాటు నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులు దోహద పడతాయి.మునగ నాటిన దాదాపు 45 రోజుల తర్వాత ఒక గుంతకు నత్రజని 45 గ్రాములు, పొటాష్ 30 గ్రాములు, భాస్వరం 15 గ్రాముల ఎరువులు అవసరం అవుతాయి.మునగ విత్తనాలు నాటిన మూడు నెలలకు ఒక్కో గుంతకు యూరియా 100 గ్రాములు, మ్యురేట్ ఆఫ్ పొటాష్ 50 గ్రాములు నీటితో కలిపి పారించాలి.విత్తనాలు నాటిన ఆరు నెలలకు, 9 నెలలకు ఒకసారి మళ్లీ యూరియా 100 గ్రా, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 50 గ్రాములు నీటితో పారించాలి.

ముఖ్యంగా పశువుల ఎరువు 500 గ్రాములు, వేపచెక్క 250 గ్రాములు ఒక గుంతకు అందించాలి.సాధారణ పద్ధతిలో కాకుండా ఫర్టిగేషన్ ద్వారా ఎరువులను అందిస్తే మొక్కకు నేరుగా ఎరువులు అంది దిగుబడి పెరుగుతుంది.ఒక హెక్టార్ లో సాగు చేస్తున్న మునగ పంటకు 113 కిలోల సూపర్ ఫాస్ఫేట్ ను మొక్కల పాదులలో వేసుకోవాలి.రసాయనిక ఎరువుల వాడకం దాదాపుగా తగ్గాలంటే ఒక్క ఫర్టిగేషన్ విధానం ద్వారానే సాధ్యం అవుతుంది.
ఈ పద్ధతిలో మొక్కకు కావలసిన పోషకాలు సంపూర్ణంగా అంది మంచి నాణ్యత గల దిగుబడి పొందవచ్చు.







