నల్లగొండ జిల్లా:మునుగోడు ఉపఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ఆరు నెలల్లో మునుగోడును అమెరికా చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు.ఆదివారం మునుగోడులో కేఏపాల్ 59వ,పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.
తన 59వ పుట్టినరోజు సందర్భంగా మునుగోడు నియోజకవర్గంలోని 59 మంది నిరుద్యోగులను లాటరీ పద్ధతిన ఎంపిక చేసి వారికి పాస్ పోర్ట్తో పాటు అమెరికన్ వీసాను ఉచితంగా ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.ఈ సదవకాశాన్ని మునుగోడు యువత అందిపుచ్చుకోవాలని కోరారు.
ఇందుకోసం నియోజకవర్గంలోని 50 వేల మంది నిరుద్యోగులు తమ రెజ్యూమ్లు తీసుకొని, సెప్టెంబర్ 25న శ్రీవారి హోమ్స్ గ్రౌండ్స్కి రావాలని కేఏ పాల్ బంపరాఫర్ ప్రకటించిన విషయం తెలిసిందే.అన్నట్లుగానే ఆదివారం తన జన్మదిన కానుకగా 59 మందికి వీసా లక్కి డ్రా తీశారు.
డ్రాలో గెలుపొందిన వారిని అమెరికా పంపించనున్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఒక బీసీ కుటుంబంలో పుట్టి,దళిత అమ్మాయిని పెళ్లి చేసుకున్న తనకు,నిరుద్యోగుల కష్టాలు ఎలా ఉంటాయో తెలుసని చెప్పారు.
ఇంటికో ఉద్యోగం ఇస్తానని సీఎం కేసీఆర్,సంవత్సరానికి రెండు కోట్లు ఇస్తానని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినా ఇంతవరకూ ఆ హామీల్ని నెరవేర్చలేదని దుయ్యబట్టారు.ఆర్థికంగా మెరుగ్గా ఉన్న రాష్ట్రాన్ని ప్రభుత్వం అప్పులపాలు చేసిందన్నారు.
అయితే ఉపఎన్నికల కోసం పార్టీలన్నీ తమ అభ్యర్థులను ప్రకటించినా టీఆర్ఎస్ ఇంకా ప్రకటించలేదని గుర్తు చేశారు.ఉప ఎన్నికల సందర్భంగా తమ అభ్యర్థిని గెలిపిస్తే ఆరు నెలల్లో మునుగోడును అమెరికా చేస్తానని, నియెజకవర్గంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.
కేఏపాల్ నిర్వహించిన కార్యక్రమంలో ప్రజా గాయకుడు గద్దర్ పాల్గొన్నారు.