ఒక్కోసారి బయటకు వెళ్లినప్పుడు వెంట డెబిట్ కార్డు తీసుకెళ్లడం మర్చిపోతుంటాం.డబ్బు అవసరం పడగానే అప్పుడు డెబిట్ కార్డు మర్చిపోయామని గుర్తుకు వచ్చి చింతిస్తుంటాం.
ఇక అలాంటి ఇబ్బందులు అవసరం లేదు.ఇప్పుడు ఫోన్ చేతిలో ఉంటే చాలు.
ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసుకునే సౌలభ్యం ఉంది.మన ఫోన్లలో ఉండే యూపీఐ ఆధారిత యాప్ల నుంచి ఏటీఎంలో ప్రదర్శితమయ్యే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు డ్రా చేయొచ్చు.
దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
భారతదేశంలో ఏటీఎంలను తయారు చేసే సంస్థ ఎన్సీఆర్ కార్పొరేషన్ ఇంటర్ఆపరబుల్ కార్డ్లెస్ నగదు ఉపసంహరణ వ్యవస్థను ప్రారంభించింది.
ఈ సదుపాయాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సిటీ యూనియన్ బ్యాంక్ భాగస్వామ్యంతో మొదలు పెట్టింది.ఈ సాంకేతికత కారణంగా వినియోగదారులు క్రెడిట్, డెబిట్ కార్డ్ లేకుండానే ఏటీఎం నుంచి సులభంగా నగదును విత్డ్రా చేసుకోవచ్చు.
సిటీ యూనియన్ బ్యాంక్కు దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 1,500ల ఏటీఎంలు ఇప్పటికే ఈ కొత్త ఫీచర్ను కలిగి ఉన్నాయి.స్మార్ట్ఫోన్లో గూగుల్ పే, పే టీఎం, ఫోన్ పే వంటి యూపీఐ ఆధారిత యాప్లు ఉన్నాయి.
యూపీఐ స్కాన్ కోడ్ ఉండే ఏటీఎంకు మీరు వెళ్లాల్సి ఉంటుంది.అక్కడ క్యూఆర్ కోడ్ ఆధారిత డ్రా విధానాన్ని ఎంచుకోవాలి.ఆ తర్వాత ఫోన్లో ఏదో ఒక యూపీఐ యాప్ను ఓపెన్ చేసి, స్కాన్ చేయాలి.ఆ తర్వాత ఎంత నగదు తీసుకుంటున్నామో నమోదు చేయాలిప.
ఇది పూర్తయిన తర్వాత డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చు.డబ్బును విత్డ్రా చేయాలనుకున్న ప్రతిసారీ కొత్త క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయాల్సి ఉంటుంది.
ఇది కొంచెం చికాకు కలిగించినా, లావాదేవీలను సురక్షితంగా ఉంచుతుంది.ప్రస్తుతం ఈ విధానంల విత్ డ్రా పరిమితి రూ.5 వేలు మాత్రమే ఉంది.రానున్న కాలంలో ఈ పరిమితి పెంచే ప్రయత్నాలు చేయనున్నారు.
ఈ విధానం గురించి ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులతో ఎన్సీపీఐ మాట్లాడుతోంది.వారందరి సమ్మతితో ఈ విధానాన్ని అన్ని ఏటీఎంలలో అమలు చేసేలా కొద్ది నెలల్లో ప్రకటించే అవకాశం ఉంది.