గత కొద్ది రోజులుగా తెలంగాణ బిజెపిలో గందరగోళమే నెలకొంది.ముఖ్యంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి బిజెపిలో చేరిన కొంతమంది కీలక నేతలు పార్టీలు తమకు సరైన ప్రాధాన్యం లభించడం లేదనే అసంతృప్తితో ఉన్నారు.
దీనికి తోడు మొదటి నుంచి బిజెపిలో ఉన్న నాయకులు తమను పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తున్నారని, పార్టీలో తమ ప్రాధాన్యం పెరగకుండా చూస్తున్నారనే అసంతృప్తితో ఉంటూ వస్తున్నారు.దీంతో ఈ విషయంపై బిజెపి హై కమాండ్ దృష్టి సారించింది.
ఈ మేరకు హుజూరాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తో పాటు, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లను ఢిల్లీకి పిలిచారు.
వీరితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో పాటు, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ ,పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఈటెల రాజేందర్, రాజగోపాల్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాజకీయాలకు సంబంధించి అనేక అంశాలపై ఆరా తీసినట్టు తెలుస్తోంది.
గత కొంతకాలంగా పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఈటెల , రాజగోపాల్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారని , పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతూ ఉండడం పైన అమిత్ షా ఆరా తీశారట.అలాగే ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిస్థితులు, గతంలో బిజెపికి ఉన్న గ్రాఫ్, ఇప్పుడు ఉన్న గ్రాఫ్ పైన అమిత్ షా చర్చించారట.
దాదాపు గంట పాటు జరిగిన ఈ చర్చల్లో అనేక అంశాలపై అమిత్ షా క్లాస్ పీకినట్లు విశ్వసనీ వర్గాల ద్వారా తెలుస్తోంది.అయితే పార్టీలో అసంతృప్తి నేతలుగా ప్రచారం జరుగుతున్న ఈటెల, రాజగోపాల్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడంతో, వారికి కీలకమైన పదవులు ఏమైనా అప్పగించబోతున్నారా అనే ప్రచారం కూడా జరిగింది.

ముఖ్యంగా ఈటల రాజేందర్ కు ప్రచారం కమిటీ చైర్మన్ బాధ్యతలు అప్పగిస్తారనే హడావుడి జరిగింది.కానీ అమిత్ షా తో జరిగిన చర్చల తర్వాత పదవులపై చర్చించేందుకు పిలవలేదని, ఈటెల , రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి కి కారణాలు తెలుసుకొని వారిని బుజ్జగించేందుకు పిలిచారనే విషయం అర్థమైంది.







