వీధి కుక్కల దాడిలో వ్యక్తి మృతి… చిన్నారిని లాక్కెళ్లిన వీధి కుక్కలు.పత్రికల్లో ఇలాంటి వార్తలు మనకు తరచూ కనిపిస్తూనే ఉంటాయి.
గ్రామం, పట్టణం, నగరం అనే తేడా లేకుండా ప్రతి రోజు ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి.ముఖ్యంగా వర్షాకాలంలో వీధి కుక్కల వల్ల అధికంగా మరణాలు సంభవిస్తుంటాయి.
దేశంలో ప్రతి ఏటా 15లక్షల మంది కుక్కకాటుకు గురవుతున్నారని ఒక అంచనా.కుక్క కాటుతోనే రేబిస్ వ్యాధి వస్తుంది.
అయితే వీధి కుక్కల వల్ల దీని ప్రమాదం మరింత పెరుగుతోంది.ఈ సమస్యకు పరిష్కారమే లేదా! రేబిస్ మరణాలను తగ్గించే అవకాశం లేదా! ప్రస్తుతం ప్రజలు, పాలకులు తీసుకోవాల్సిన చర్యలేమిటి! దీనిపై చర్చించాల్సిన అవసరం ఎంతో ఉంది.
కుక్కల గురించి తెలుసుకోవాలంటే ముందుగా వాటి చరిత్రను తెలుసుకోవాల్సి ఉంటుంది.నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెన్ 2021 జనవరిలో ఒక అధ్యయనాన్ని ప్రచురించింది.దీని ప్రకారం 23వేల ఏళ్ల క్రితం చివరి మంచు యుగం ముగింపు సమయంలో మనిషి, జంతువుల మధ్య స్నేహం ప్రారంభమైంది.సైబిరియాలో మొట్టమొదటి సారి గ్రే వోల్ఫ్ ను పెంచడం ప్రారంభించాడు.
ఆ సమయంలో మనిషి వేటాడి ఆహారాన్ని తీసుకునేవాడు.ఆహారం కోసం ఈ తోడేళ్లు ప్రయత్నిస్తున్న సమయంలో మనిషి వాటికి ఆహారాన్ని పెట్టి తన నియంత్రణలో తెచ్చుకొని ఉంటాడని భావిస్తున్నారు.
అదే సమయంలో తోడేళ్లు మనుషుల వేటకు సహకారాన్ని అందించడం ప్రారంభించాయి.ఆ తోడేళ్లే కాలక్రమేణా కుక్కలుగా మారిపోయాయి.
అయితే కొన్ని రకాల కుక్కల్లో కొన్ని ప్రత్యేకతలు ఉన్నట్లు గమనించిన మనుషులు వాటి వంశాల వృద్ధికి కృషి చేశారు.ప్రత్యేకంగా బ్రీడింగ్ చేసి అలాంటి వాటిని వృద్ధి చేశారు.వీధి కుక్కలను మూడు కేటగిరీలుగా విభజించవచ్చు.2021 స్టేట్ ఆఫ్ పెట్ హోమ్ లెస్ నెస్ ఇండెక్స్ రిపోర్టు ప్రకారం మిగితా దేశాల కంటే పెంపుడు జంతువులను వదిలించుకోవడం ఇండియాలో చాలా అధికంగా ఉంది.భారతదేశంలో వీరు నిర్వహించిన సర్వేలో 50 శాతానికి పైగా ప్రజలు తమ పెంపుడు జంతువులను వదిలించుకున్నట్లు అంగీకరించారు.మిగితా దేశాల్లో ఇది 28 శాతమే.ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రాంతాన్ని బట్టి వీధి కుక్కల సంఖ్యకు గరిష్ట పరిమితి ఉంటుంది.ఆయా ప్రాంతాల్లో వాటికి లభించే ఆహారం, నీరు, భూభాగాన్ని బట్టి ఇది మారుతూ ఉంటుంది.
అంటే మనం ఎలాంటి చర్యలు తీసుకోకపోయినా వీధి కుక్కల సంఖ్య ఆయా ప్రాంతాల్లో గరిష్ట పరిమితికి మించి పెరిగే అవకాశం లేదు.

టీకాలు తీసుకోని ఏ శునకం నుంచైనా మనుషులకు రేబిస్ వ్యాధి వచ్చే ప్రమాదముంది.ఇది ఎంత తీవ్రమైన వ్యాధి అంటే వీటి లక్షణాలు కనిపించడం మొదలుకాగానే.ఎవ్వరూ ఏం చేయలేని పరిస్థితి.
ఈ వ్యాధి కి వంద శాతం మరణాల రేటు ఉంది.రేబిస్ వ్యాధికి గురైన కుక్క మనుషులకు కాటు వేస్తే రేబిస్ వస్తుంది.
రేబిస్ కు గురైన కుక్కలు పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తూ కనిపించినవారినల్లా కాటువేస్తూ ఉంటాయి.వీధి కుక్కల ద్వారా దీని ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది.
ప్రపంచ దేశాల్లో రేబీస్ వ్యాధి గ్రస్తుల సంఖ్యలో భారతదేశం రెండో స్థానంలో ఉంది.మొదటి స్థానంలో కాంగో ఉంది.
డబ్ల్యూహెచ్ఓ రికార్డుల ప్రకారం ఇండియాలో ప్రతి ఏటా 20 వేల మంది రేబీస్ వ్యాధితో మృతి చెందుతున్నారు.రేబిస్ రిస్క్ వల్ల అమెరికాకు ఇండియా నుంచి కుక్కలను దిగుమతి చేసుకోవడం నిలిపివేసింది.
ఎందుకంటే అమెరికా 2007 లోనే రేబిస్ వ్యాధిని పూర్తిస్థాయిలో తమ దేశం నుంచి పారదోలింది.అయితే అప్పటి వరకు కుక్కలను అమెరికాకు ఎగుమతి చేయడంలో భారతదేశం కీలకంగా వ్యవహరించేది.

వీధికుక్కల సమస్యకు పరిష్కారం అనగానే అందరికీ వచ్చే మొదటి ఆలోచన వాటన్నింటిని చంపేయడం.అయితే ఈ పద్ధతిని పాటించడానికి ప్రయత్నించిన చాలా దేశాలు సమస్య పరిష్కారంలో విఫలమయ్యాయి.అంతేకాకుండా భారతదేశంలో వీధి జంతువులను చంపడం చట్ట విరుద్ధం.అయినా ఎన్నో గ్రామాల్లో, పట్టణాల్లో ఇలాంటి పద్ధతిని అనుసరించారు.కానీ సమస్యను పరిష్కరించలేకపోయారు.కారణం కుక్కల్లో ప్రెగ్నెన్సీ టైమ్ కేవలం రెండు నెలలే.
అంతేకాకుండా అవి ఎక్కువ పిల్లలను జన్మనిస్తాయి.అంటే ఏదైనా పట్టణం లేదా గ్రామంలో వీధి కుక్కలను పూర్తిస్థాయిలో చంపేయాలంటే దాన్ని రెండు నెలల్లోనే పూర్తి చేయాల్సి ఉంటుంది.
లేకుంటే వీధి కుక్కల జనాభా ఆటోమెటిగ్గా పెరుగుతూ గరిష్ట పరిమితికి చేరుకుంటుంది.అంతేకాకుండా ఒక్కొక్క వీధి కుక్కను వెంటాడి వేటాడడం చాలా సమయం, ఖర్చుతో కూడుకున్న పని.బ్రెజిల్ లోని ఒక పట్టణంలో ఇలాంటి ప్రయత్నమే చేసినప్పటికీ విఫలమయ్యారు.







