నిన్నగాక మొన్న పార్టీలో చేరి అప్పుడే కీలక పదవి హామీ సంపాదించడమా ? ఏళ్ల తరబడి తాము పార్టీ కోసం కష్టపడి, ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా, తమను పట్టించుకోని అధినేత, మొన్నటి వరకు తమను తిట్టి పోస్తూ, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వచ్చిన వ్యక్తికి ఇప్పుడు కీలకమైన పదవి ఎలా ఇస్తున్నారు అంటూ తీవ్ర అసంతృప్తికి గురవుతున్న వ్యవహారం హుజురాబాద్ టిఆర్ఎస్ పార్టీ లో నెలకొంది.కాంగ్రెస్ లో ఉంటూ కొద్దిరోజుల క్రితమే టిఆర్ఎస్ లో చేరిన పాడి కౌశిక్ రెడ్డి కి ఎమ్మెల్సీ పదవి నామినేటెడ్ కోటాలో ఇవ్వాలని కెసిఆర్ నిర్ణయించుకోవడం, అవసరమైతే ఆయనకు మంత్రి పదవి ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుండటం హుజూరాబాద్ నియోజకవర్గం లోని టీఆర్ఎస్ కీలక నేతల్లో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహాన్ని కలిగిస్తోంది.
ప్రస్తుతం జరగబోయే హుజురాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ కౌశిక్ రెడ్డి కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా, తాను మాత్రం ఆయన నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధంగా లేను అన్నట్లుగానే ఆ నియోజకవర్గ టీఆర్ఎస్ నేతలు అభిప్రాయపడుతున్నారు.అంతేకాకుండా, తాజాగా పార్టీ సీనియర్ నాయకుడు ఇంట్లో అసంతృప్తి నాయకులంతా సమావేశం నిర్వహించి టిఆర్ఎస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై నిరసన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి పైన చర్చ జరిగిందట.ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలోనే ఆ పార్టీ సీనియర్లకు సరైన గౌరవ మర్యాదలు ఇచ్చేవారు కాదని, ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్సీ పదవి వస్తుండడంతో టిఆర్ఎస్ సీనియర్ల వద్ద ఇదే విధమైన వ్యవహారశైలి ప్రదర్శిస్తారని, తమ గౌరవ మర్యాదలకు భంగం ఏర్పడుతుందనే ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ఎన్నికల దృష్ట్యా ఆయనకు ప్రాధాన్యం ఇచ్చినా, ఎన్నికలు ముగిసిన తర్వాత తమ పై కౌశిక్ రెడ్డి పెత్తనం చెలాయించాలని చూస్తే మాత్రం పరిస్థితులు వేరుగా ఉంటాయని, అవసరమైతే పార్టీని వీడి వేరే పార్టీలో చేరేందుకు వెనుకాడబోమని కొంతమంది నేతలు ఈ రహస్య సమావేశంలో చెప్పినట్లు సమాచారం.ఈ వ్యవహారం కొంతమంది టిఆర్ఎస్ రాష్ట్రస్థాయి నేతలకు తెలియడంతో, ఇవన్నీ సర్వసాధారణమైనవేనని, వేరొకరికి కీలక పదవులు దక్కితే మిగిలిన వారు అసంతృప్తి కి గురవ్వడం, కలత చెందడ ఇవన్నీ మామూలు వ్యవహారాలేనని, అన్నీ త్వరలోనే సర్దుకుంటాయి అంటూ కొంతమంది నేతల వద్ద వ్యాఖ్యానించినట్టు సమాచారం.