వైద్య చరిత్రలో ఒక అరుదైన సంఘటన తాజాగా ఝార్ఖండ్లో రాంచీలో వెలుగు చూసింది.అమ్మ కడుపులో నుంచి బయటికి వచ్చి 30 రోజులు కాకముందే ఒక ఆడపిల్ల కడుపులో ఎనిమిది పిండాలు ఏర్పడ్డాయి.
అసలు అది ఎలా సాధ్యం? అనే కదా మీ సందేహం.అయితే ఈ వింత మెడికల్ కేసు గురించి మీరు తెలుసుకోవాల్సిందే.
వివరాల్లోకి వెళ్తే.ఝార్ఖండ్లోని రామ్గఢ్ జిల్లాలో అక్టోబర్ 10న ఓ ఆసుపత్రిలో ఆడబిడ్డ జన్మించింది.
డాక్టర్లు ఆ బిడ్డ ఆరోగ్య పరిస్థితి బాగోలేదని తెలుసుకున్నారు.ఆపై సీటీ స్కాన్ నిర్వహించారు.
స్కాన్ ఫలితాలను చూసి బిడ్డ కడుపులో కణితి ఉందని భావించారు.మెరుగైన చికిత్స కోసం బిడ్డను రాంచీకి రెఫర్ చేశారు.రాంచీలోని రాణి పిల్లల ఆసుపత్రికి చెందిన వైద్యుల బృందం ఈ బిడ్డ కడుపులో నుంచి కణితి తొలగించేందుకు సిద్ధమయ్యారు.కాగా వారికి ఈ బిడ్డ కడుపు లోపల ఎనిమిది పిండాలు కనిపించాయి.
దాంతో ఆశ్చర్య పోవడం వారివంతయింది.సాధారణంగా కవలల పిండాల్లో ఒక పిండం సరిగా అభివృద్ధి చెందకపోతే అది ఇంకొక కవల బిడ్డలోని కడుపులోకి చేరుతుంది.
ఈ కేసులో మాత్రం ఏకంగా ఎనిమిది పిండాలు మరొక బిడ్డ కడుపులో కనిపించాయి.

ఈ విషయం తెలిసిన తర్వాత వైద్యులు బిడ్డ కడుపు నుంచి 8 పిండాలను తొలగించారు.పసిబిడ్డలో 8 పిండాలను కనుగొనడం ప్రపంచంలో ఇదే మొదటి కేసు అని వైద్యులు తెలిపారు.ఈ ఆపరేషన్ విజయవంతమైంది.
ప్రస్తుతం బిడ్డ పరిస్థితి సాధారణంగా ఉంది.పాపను అబ్జర్వేషన్లో ఉంచామని, వారం రోజుల్లో డిశ్చార్జి చేస్తామని డాక్టర్లు చెప్పారు.
ఏదేమైనా ఈ మెడికల్ కేసు ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.