ఇటీవల ప్రగతిభవన్లో కేసీఆర్ బిజీ బిజీగా గడుపుతున్నారు.భారతీయ రాష్ట్ర సమితి పేరుతో బీఆర్ఎస్ అనే జాతీయ పార్టీని స్థాపించాలని కేసీఆర్ భావిస్తున్నారు.
దీంతో రాజకీయ విశ్లేషకులతో వరుసగా ఆయన మంతనాలు జరుపుతున్నారు.ఈ సమావేశాల్లో ప్రశాంత్ కిషోర్ కూడా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.
అటు జాతీయ రాజకీయాలతో పాటు ఇటు రాష్ట్రంలోని రాజకీయాలపైనా కేసీఆర్ దృష్టి సారించారు.ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పనితీరుపై కేసీఆర్ నివేదికలు తెప్పించుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.
తెలంగాణలోని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు, ఎవరిపై ఎక్కువ వ్యతిరేకత, ఎవరిపై అనుకూలత, పార్టీ బలాలు, బలహీనతలు, ప్రత్యర్థుల బలాలు, బలహీనతలు తదితర అంశాలపై ఐప్యాక్ టీం సర్వే నిర్వహించింది.ఈ సర్వే నివేదికతో పీకే కేసీఆర్ను కలిశారు.
దాదాపుగా 40 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను మార్చే అవకాశం ఉంటుందని, కొత్తవారికి అవకాశం ఇవ్వడంద్వారా విజయావకాశాలు మెరుగుపడతాయని ప్రశాంత్ కిషోర్ సూచించినట్లు తెలుస్తోంది.ఇటీవల పీకే సర్వే ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు టికెట్లు ఇస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
సర్వేలో మెరుగైన పనితీరు లేదని వచ్చిన వారిని పక్కనపెట్టేస్తారని కేటీఆర్ స్పష్టంగా సంకేతాలు ఇచ్చారు.దీంతో టీఆర్ఎస్ పార్టీలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలలో గుబులు పుట్టింది.అయితే ఇదే తరహా కామెంట్లను ఏపీలో జగన్ కూడా చేశారు.గడప గడపకు కార్యక్రమంపై నిర్వహించిన వర్క్ షాప్ సందర్భంగా ఎమ్మెల్యేల పనితీరు గురించి జగన్ ప్రధానంగా చర్చించారు.
ఈ మేరకు ఎవరి పర్ఫార్మెన్స్ ఎంతో జగన్ బహిర్గతం చేశారు.ఏకంగా రిపోర్టులను ఎమ్మెల్యేల ముందే జగన్ ఉంచారు.

అయితే జగన్ చేసినట్లు కేసీఆర్ కూడా ఎమ్మెల్యేల రిపోర్టులను బహిర్గతం చేస్తారా అన్న ప్రశ్న ఇప్పుడు టీఆర్ఎస్ నేతల్లో ఉత్పన్నమవుతోంది.గతంలో పార్టీ ఎమ్మెల్యేల పనితీరు ఏ విధంగా ఉందనే దానిపై సీఎం కేసీఆర్ కనీసం 6 నెలలకు ఒకసారైనా వారికి ప్రొగ్రెస్ కార్డు ఇచ్చేవారు.ఆ రిపోర్టుల ఆధారంగా ఎమ్మెల్యేలకు కేసీఆర్ వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.అలాగే ఇప్పుడు కూడా ఐప్యాక్ టీమ్ సర్వేలను జగన్ తరహాలో బహిర్గతం చేస్తే బాగుంటుందని.
అప్పుడు ప్రజల్లోకి వెళ్లి తమ పనితీరును మెరుగుపరుచుకునేందుకు అవకాశం ఉంటుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు.







