ఏపీలో బీజేపీ పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది జనాలతో పాటు, ఆ పార్టీ అగ్ర నాయకులు అందరికీ బాగా తెలుసు. పేరుకు పార్టీ తప్ప పెద్దగా ప్రయోజనం లేదు అన్నట్లుగా పరిస్థితి ఉంది.
ఎప్పటి నుంచో బిజెపిని ఏపీలో బలోపేతం చేసేందుకు, ఆ పార్టీ అధిష్టానం ప్రయత్నాలు చేస్తున్నా, ఏపీ నేతలు మాత్రం అంత చురుగ్గా వ్యవహరించలేకపోతున్నారు.పార్టీ బలోపేతం కోసం పార్టీ అధ్యక్షులు ఎంతమందిని మార్చినా, పరిస్థితుల్లో మాత్రం పెద్దగా మార్పు అయితే కనిపించడం లేదు.
ఈ విషయాలు అన్నింటిపైనా ఎప్పటి నుంచో అసంతృప్తితోనే పార్టీ అధిష్టానం ఉంటూ వస్తోంది. గతంలో కన్నా లక్ష్మీనారాయణ ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో టీడీపీతో సన్నిహితంగా మెలగడం , ఏపీలో బీజేపీ బలోపేతానికి పెద్దగా కృషి చేయక పోవడం తదితర కారణాలతో ఆయనను అధ్యక్ష స్థానం నుంచి తప్పించి సోము వీర్రాజు కు ఆ బాధ్యతలు అప్పగించారు. మొదట్లో ఆయన యాక్టివ్ గా ఉన్నట్టు గా కనిపించినా, అధికార పార్టీ వైసీపీ విషయంలో కాస్త సానుకూల ధోరణి తో ఉన్నట్టుగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. ఏపీలో బీజేపీ పోరాడేందుకు ఎన్నో ప్రజా సమస్యలు ఉన్నా, బిజెపి ఏపీ నేతలు పెద్దగా పట్టించుకోనట్టు వ్యవహరిస్తున్నారు.
వీటన్నింటిపైనా నివేదికలు ఫిర్యాదులు రావడంతో, ఇటీవల తిరుపతికి వచ్చిన కేంద్ర హోం మంత్రి , బీజేపీ కీలక నేత అమిత్ షా ఏపీ నేతలకు గట్టిగానే క్లాస్ పీకారు.ముఖ్యంగా సోము వీర్రాజు ను ఉద్దేశించి దూకుడుగా ముందుకు వెళ్లాలని అధికార పార్టీ వైసిపి , టిడిపి లపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ పోరాటం చేయాలని, జనసేన ప్రజా సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
అమిత్ షా గట్టిగానే క్లాస్ పీకడం తో సోము వీర్రాజు యాక్టివ్ అయినట్టు కనిపిస్తున్నారు .అమరావతి ఉద్యమం లో బిజెపి కూడా పాల్గొంటుంది అంటూ ఆయన ప్రకటించారు. గతంలో అమరావతిని వీర్రాజు పట్టించుకొనట్టుగా వ్వహరించేవారు .అంతేకాదు ఇక వైసీపీ ప్రభుత్వాన్ని టిడిపిని టార్గెట్ చేసుకుంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేయడంతో పాటు , ప్రజా సమస్యల విషయంలో గట్టిగా పోరాడుతూ తన సత్తా చాటుకోవాలనే లక్ష్యంతో వీర్రాజు ఉన్నట్టుగా కనిపిస్తున్నారు.
.