ఈరోజుల్లో ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.వీరికి మందుల కోసం అయ్యే ఖర్చుల వల్ల కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోతున్నాయి.
అయితే ఇలా ఆర్థికంగా చితికిపోతున్న పేద, మధ్యతరగతి ప్రజల కోసం జైపూర్కు చెందిన కొందరి స్నేహితులు ‘దవా దోస్త్’ అనే మెడికల్ షాప్స్ తీసుకొచ్చారు.ఈ మెడికల్ సంస్థల ద్వారా తక్కువ ధరకే జనరిక్ మెడిసిన్స్ అందజేస్తున్నారు.‘దవా దోస్త్’ ఫార్మసీ రిటైల్ చైన్ను 2018లో పరిచయం చేశారు.దీని ద్వారా ఎక్కువ మంది ప్రజలకు అతి తక్కువ ధరలకే మెడిసిన్స్ అందించాలని ఆ మిత్రబృందం ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ కంపెనీ ప్రతీ ప్రిస్క్రిప్షన్పై 50 నుంచి 80 శాతం తగ్గింపులతో మెడిసిన్స్ అందజేస్తుంది.
సుదూర ప్రాంతాల్లో మెడికల్ షాప్స్ లేక చాలామంది ఇబ్బంది పడుతుంటారు.
ఈ సంస్థ ఈ సమస్యకు కూడా పరిష్కారం చూపింది.మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలకు కూడా దవా దోస్త్ ద్వారా మెడిసిన్స్ అందుబాటులోకి తీసుకువచ్చే దిశగా కృషి చేస్తున్నారు.
ఇందుకోసం ఈ కంపెనీ వారు భారతదేశమంతటా ఉన్న కిరాణా స్టోర్స్తో టై-అప్ కావాలనుకుంటున్నారు.ఇప్పటికే కొన్ని చోట్ల టై-అప్ అయినట్టు తెలుస్తోంది.
కంపెనీ అధికారిక గణాంకాల ప్రకారం, అఫిలియేట్ మార్కెటింగ్ మోడల్ ద్వారా భారత దేశ వ్యాప్తంగా 2,500 కిరాణా స్టోర్స్లో ‘దవా దోస్త్’ మెడిసిన్స్ అందించడం ప్రారంభించారు.కాగా ఒక్కో దవా దోస్త్ స్టోర్లో 70 వేల కంటే ఎక్కువ మెడిసిన్స్ అందుబాటులో ఉండటం విశేషం.అంతేకాదు మొబైల్/పీసీ సాయంతో ఆర్డర్ చేసిన మెడిసిన్స్ ను ఇంటి ముందుకు వచ్చి డెలివరీ చేస్తారు.ఈ వెంచర్ ప్రారంభమైనప్పటి నుంచి 35 లక్షలకు పైగా భారతీయులకు సేవలు అందించడం జరిగింది.