లోక్ సభ ఎన్నికలు( Lok Sabha Elections ) సమీపిస్తున్న తరుణంలో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ తీవ్ర కసరత్తు చేస్తుంది.ఇందులో భాగంగా తమ పార్టీ అభ్యర్థులకు మద్ధతుగా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు.
ఎంపీ అభ్యర్థుల ప్రచార పర్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) తన భుజాలపై వేసుకున్నారు.ఈ క్రమంలోనే రేపటి నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి మే 13వ తేదీ వరకు సభలు, సమావేశాలు నిర్వహించనున్నారు.
కాగా మొత్తం 50 సభలతో పాటు ర్యాలీలు నిర్వహించే విధంగా కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది.ఇందులో భాగంగా రోజుకు రెండు నియోజకవర్గాల్లో సభలు, ర్యాలీల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే విధంగా పార్టీ నాయకత్వం ప్రణాళిక రచిస్తోందని తెలుస్తోంది.
అదేవిధంగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమాల్లోనూ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.రేపు మహబూబ్ నగర్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి( Mahaboobnagar Candidate Vamshi Chander Reddy ) నామినేషన్ ర్యాలీకి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారని సమాచారం.
అదేవిధంగా సాయంత్రం మహబూబాబాద్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొనున్నారు.ఈ ప్రచారంలో భాగంగా వంద రోజుల ప్రభుత్వ పాలనను వివరించనున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మ్యానిఫెస్టో, గ్యారంటీలను జనంలోకి తీసుకెళ్లనున్నారు.







